తమిళనాట మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణం తమిళ రాష్ట్రాన్నే కుదిపేసిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అమ్మ తర్వాత, చిన్నమ్మ అధికారాన్ని చేపట్టాలని ఆశపడ్డా సుప్రీం కోర్టు అందుకు అవకాశం ఇవ్వకపోగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే ఇప్పుడు శశికళ జైల్లో తన శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. అయితే జైల్లో కూడా ఆమెను తెమిల ప్రజలు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదట.
శశికళకు తమిళనాడు నుంచి కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు వచ్చిపడుతున్నాయి. ఫిబ్రవరి 15 మొదలు ఇప్పటివరకు 100 పైగా లేఖలు వచ్చాయని సమాచారం. ‘శశికళ, సెంట్రల్ జైలు, పరప్పన అగ్రహార, బెంగళూరు 560100’ అడ్రస్తో ఈ లేఖలు వస్తున్నాయి. జయలలితకు ఎలాంటి అనారోగ్యం లేదనీ... పథకం ప్రకారమే శశికళ ఆమె హత్యకు కుట్రపన్నారనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. అదే విషయాన్ని లేఖల్లో ప్రస్తావిస్తున్నారు.'
అని జైలువర్గాలు తెలిపాయి. ''మా తలైవిని, మాప్రియమైన అమ్మని చంపింది నువ్వే.. విశ్వాసఘాతకురాలివి, వెన్నుపోటుదారువి, నీకు కనీస కృతజ్ఞత లేదు. నీకు జీవితాన్ని, సర్వస్వాన్ని ఇచ్చిన వ్యక్తినే మోసం చేశావు.. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన నిర్వాకానికి అంతకంతకు అనుభవిస్తావు’’ అని మచ్చుకు ఓ లేఖలోని సారాంశాన్ని జైలు వర్గాలు ఉటంకించాయి. మొదట్లో తనకు వచ్చిన లేఖలను శశికళ స్వయంగా చదివేవారు. దాదాపు అన్నిటిలోనూ తిట్ల పురాణమే కనిపిస్తుండడంతో క్రమంగా చదవడం ఆపేశారు’’ అని జైలువర్గాలు వెల్లడించాయి.