పాక్ ఆ ప్రాంతాలు విడిచి వెళ్లాల్సిందే: భారత్..
ఆక్రమిత కశ్మీర్ భూభాగం, గిల్గిత్ బాల్తిస్థాన్ భూభాగం నుంచి పాకిస్థాన్ వెళ్లిపోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఎన్నో ఏళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యకు ఇదే కారణమని చెప్పింది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్ అక్రమంగా ఏయే ప్రాంతాలను ఆక్రమించుకుందో వాటన్నింటిని వదిలేసి వెళ్లిపోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
మోడీకి ముస్లిం యువతి లేఖ
కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని షుగర్ టౌన్ ప్రాంతానికి చెందిన బీబీ సారా(21) అనే ముస్లిం మహిళ ఇటీవల ప్రధాని మోడీకి లేఖ రాసింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనకు ఉన్నత చదువులు చదవాలని ఉందని, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని లేఖలో పేర్కొంది. అంతేకాదు, ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకులను సంప్రదించినా.. ఏ ఒక్క బ్యాంకు తనకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పదిరోజుల్లో ఆమెకు పీఎంవో కార్యాయలం నుంచి జవాబు వచ్చింది. బీబీ సారాకు విద్యా రుణం మంజూరు చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రధాని మోడీ కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
శశికళను తిడుతూ ఉత్తరాలు..
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నాటరాజన్ ను బండబూతులు తిడుతూ, శపిస్తూ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు ఉత్తరాలు పొటెత్తడంతో ఆమె వర్గీయులు హడలిపోతున్నారు. జయలలిత మరణానికి కారణం అయిన శశికళ పతనం అయిపోతుందని శాపిస్తూ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు 100కు పైగా ఉత్తరాలు వచ్చినట్లు జైలు అధికార వర్గాలు తెలిపాయి.
ఆర్కేనగర్లో కొత్త గుర్తులు..
తమిళనాడులోని అధికార పక్షం అన్నాడీఎంకేలో వర్గపోరు నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని స్తంభింపచేసిన కేంద్ర ఎన్నికల సంఘం..శశికళ, పన్నీర్ సెల్వం
వర్గాలకు కొత్త గుర్తులు కేటాయించింది. జయ మృతితో ఖాళీ అయిన RK నగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న జరిగే ఉపఎన్నిక కోసం... శశికళ వర్గానికి ఏఐఏడీఎంకే -అమ్మ పార్టీ పేరును... టోపీ గుర్తును ఖరారు చేసింది. పన్నీర్ వర్గానికి ఏఐడీఎంకే పురచ్చి తలైవి అమ్మ పార్టీ పేరును... విద్యుత్ స్తంభం చిహ్నాన్ని ఈసీ కేటాయించింది.
ఎయిరిండియా ఉద్యోగిని 25సార్లు చెప్పుతోకొట్టాడు ఎంపీ
శివసేన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రవీంద్ర గైక్వాడ్ తన కండకావరాన్ని మరోసారి చాటుకున్నాడు. తనకు బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వలేదంటూ ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టారు. పుణె నుంచి న్యూఢిల్లీ వెళ్లే విమానం ఉదయం 11 గంటలకు ల్యాండవగానే ఎంపీ.. ఉద్యోగిపై దాడికి దిగాడు. అంతేగాక, తన చర్యను ఆయన సమర్థించుకోవడం గమనార్హం. 25సార్లు చెప్పుతో కొట్టానని ఆయనే చెప్పుకొచ్చారు. 'అవును నేను అతన్ని కొట్టాను. అతను నాతో తప్పుగా ప్రవర్తించాడు' అని గైక్వాడ్ తెలిపాడు.