అది మంచయినా చెడయినా సరే ఓ మీడియా ఉండటం ఎంత అవసరమో తాజాగా విజయవాడ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంపై టీడీపీ నాయకుల గూండా గిరీ ఘటన మరోసారి రుజువు చేసింది. ఔను.. మరి.. మొన్న విజయవాడ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంపై బెజవాడ నేతలు గూండాగిరీ చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, వందల మంది కార్యకర్తలు.
ఏకంగా ఐపీఎస్ ర్యాంకు ఉన్న ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ను నిలబెట్టి తిట్టేసారు.. గడ్డి తింటున్నావా.. అంటూ నిలదీశారు. ఓ ఐపీఎస్ ఆఫీసర్ గన్ మెన్ పైనే చేయి వేశారు. ఎంతైనా అధికార పార్టీ నాయకులు.. అందులోనూ లోకల్ లీడర్లు. అందుకే పాపం ఆ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ అన్నీ పళ్లబిగువన భరించారు. గూండాగిరీ అంతా మౌనంగా చూస్తూ ఉండిపోయారు.
ఇదంతా మీడియా సమక్షంలోనే జరిగింది. కానీ ప్రముఖ మీడియా హౌజులన్నీ దీన్ని లైట్ గా తీసుకున్నాయి. అత్యధిక సర్క్యులేషన్ కలిగి.. పసుపు పక్షపాతం వహిస్తుందని పేరున్న ప్రముఖ మీడియా సంస్థ దీన్ని కనీసం మెయిన్ ఎడిషన్లో కూడా కవర్ చేయలేదు. అంత ప్రాధాన్యత లేనట్టు జిల్లా ఎడిషన్ లో వార్త రాసి ఊరుకున్నారు. దానికి చెల్లెలుగా పేరున్న మరో తోక పత్రికగా పేరున్న పత్రిక కూడా అంతే.
సాక్షి మీడియా అంటూ ఒకటి లేకపోతే.. ఈ వార్త అలా ముగిసిపోయేదే.. ఆ నాయకుల దౌర్జన్యం అలా సాగిపోయేదే.. కానీ సాక్షి పత్రిక దీన్ని ఐపీఎస్ పై గూండాగిరీ అని పతాక శీర్షికతో ప్రచురించడంతో అధికార పార్టీ స్పందించక తప్పలేదు. అందులోనూ ఓ వైపు అసెంబ్లీ జరుగుతున్నదాయె.. అందుకే చంద్రబాబు ఫాస్ట్ గా రియాక్టయ్యారు.
డ్యామేజీ పెరగకముందే మేలుకొని ఆ నాయకులతో సారీ చెప్పించారు. ఇదే ఘటన. సాక్షి మీడియా అంటూ ఒకటి లేకపోతే.. అనామకంగా ముగిసిపోయేదే.. అలాగే ఇదే ఘటనలో వైసీపీ నాయకులు పాల్గొని ఉంటే.. ఇదే పచ్చ పత్రికలు ఎంతగా రెచ్చిపోయేవో ఊహించడం కష్టమేమీ కాదు. అలాగని సాక్షి రాతలన్నీ సత్యాలని కాదు. కానీ సర్కారులోమరో కోణం చూపించాలంటే అలాంటి మీడియా ఉండాల్సిందే.. ఏమంటారు..!?