ఈ మద్య భారత దేశంలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలు, యువతులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు బాగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మృగాళ్లు. తాజాగా ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ ప్రాంతంలో పతంజలి స్టోర్స్లో పనిచేసే గుంజన్ అనే యువతిని గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడు. హత్యఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది గానీ, హంతకుడిని గుర్తుపట్టలేకపోతున్నట్లు పోలీసులు చెప్పారు.
స్టోర్ నుంచి రాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. యూపీకి చెందిన గుంజన్ (18) తల్లిదండ్రులతో కలిసి గురుగ్రామ్ లో నివసిస్తోంది. సెక్టార్ 21లో ఉన్న పతంజలి స్టోర్ లో ఆమె సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ... దూర విద్యలో డిగ్రీ చదువుతోంది. కాగా సోమవారం రాత్రి 9గంటలకు ఇంటికి వస్తుండగా ఆమెను ఎవరో చంపేశారు. అప్పటికి చాలావరకు దుకాణాలు తెరిచే ఉన్నాయని అన్నారు.
మంచినీళ్ల కోసం ఆమె షాపు నుంచి బయటకు వచ్చిందని, అంతలో కాల్పుల శబ్దం వినిపించిందని, ఒకేసారి తుపాకి మోత వచ్చిందని, దాంతో ఆమె కుప్పకూలిపోయిందని అదే దుకాణంలో పనిచేసే సుమిత్ అనే యువకుడు చెప్పాడు. గుంజన్ తండ్రి చంద్రభాన్ పవన్ అనే యువకుడే తన కూతురిని చంపినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంజన్-పవన్ లకు మూడేళ్ల నుంచి పరిచయం ఉందని చెప్పాడు. పోలీసులు పవన్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారమే కారణమన్న కోణంలోనూ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.