భారత క్రికెటర్ దోనీ భార్య సాక్షి సీరియస్ అయ్యారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ ఆధార్ వివరాలు ట్విట్టర్ లో లీక్ అయ్యాయి. ధోనీకి సంబంధించి ఆధార్ వివరాలు లీక్ అయిన నేపథ్యంలో ఆయన భార్య సాక్షి ధోనీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. రాంచీలోని సీఎస్సీ కేంద్రంలో క్రికెటర్ ధోనీ, ఆయన ఫ్యామిలీ సభ్యులు ఆధార్ వివరాలు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆధార్ అప్డేట్ చేసే కామన్ సర్వీస్ సెంటర్- సీఎస్సీ ట్విట్టర్లో పోస్టు చేసింది.
రహస్య సమాచారం లీక్ పై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా వ్యక్తిగత వివరాలను ఎలా బయటపెడతాంటూ సీరియస్ అయ్యారు సాక్షి. ఈ సందర్భంలో రవిశంకర్ ప్రసాద్, సాక్షి సింగ్ల మధ్య వరుసపెట్టి ట్వీట్ల జోరు కొనసాగింది. వెంటనే ఆ విషయాన్ని గమనించిన మంత్రి.. ఆ శాఖ చేసిన తప్పును గ్రహించి, తగిన చర్యలు తీసుకుంటామని సాక్షి సింగ్కు హామీ ఇచ్చారు.
విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు థాంక్స్ చెప్పారు. వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టడం నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. మంత్రిగారి నుంచి సరైన సమాధానం రావడంతో సాక్షి సంతోషించారు..అంతే కాదు ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఈ విషయం తెలియగానే సీఎస్సీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ధోనీ అప్లికేషన్ కనిపించే ఫొటోను డిలీట్ చేసేశారు.