తమిళ నాడు రాజకీయాలెప్పుడూ రసవత్తరమే. అప్పుడు జయలలిత నమ్మినబంటు పనీర్ సెల్వం నిజంగా నమ్మిన బంటు లాగే సేవ చేశాడు. ఆమె మరణం తరవాత కూడా ఆమే దైవంగా జీవిస్తున్నాడు. కాని శశికళ నమ్మిన బంటు పళని సామి మొత్తం శశికళ కుటుంబాన్నే పదవులనుండే కాదు పార్టీ నుండే తరిమేశాడు. నమ్మిన బంట్లు వారి స్వభావమే కాదు యజమానిని స్వభావం పై కూడా ఆధారపడి తయారవుతారు. తమిళనాట రసవత్తర రాజకీయం సరికొత్త మలుపు తీసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించినంత కాలం ఆ రాష్ట్ర రాజకీయాలు నల్లేరు మీద నడకలా సాఫీగానే నడిచాయి.
ఆమె మరణం తర్వాత ఒక్కసారిగా రాజకీయ పక్షులకు రెక్కలొచ్చాయి. అన్నా- డీఎంకేలో శశికళ దురాశతో, చీలిక వచ్చేసింది. అమ్మ నమ్మిన బంటు పన్నీర్ సెల్వంను కుర్చీ మీద నుంచి లాగేసి, జయలలిత నెచ్చెలి శశికళ, తాను ఆ సింహాసనాన్ని అధిష్టించాలని చేసిన యత్నాలు బెడిసి కొట్టడంతో తనకు నమ్మిన బంటుగా ఉన్నాడని భావించిన పళనిసామిని ఆ పీఠం ఎక్కించారామె. నమ్మిన బంటు అనుకున్న ఆయన కాస్తా పక్కలో బల్లెం అయ్యాడు ఈమెకు నమ్మిన బంటుగా ఎలావుంటాను ఈమే జయలలితకు నమ్మక ద్రోహం చేసిందికదా! అనుకొని, వ్రతం చెడ్డా ఫలం దక్కాలని, ఆమె జైలుకు వెళ్లగానే ఆమె నమ్మిన బంటుగా ముద్ర పడ్డ పళనిసామే, ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా పార్టీ నుంచి బయటకు గెంటేశారు. పక్కలో బల్లెం అయ్యాడు.
ఈ క్రమంలో నిన్నటి దాకా శత్రువులు గా మెలగిన పన్నీర్ సెల్వం, పళని సామిలు, ఇప్పుడు "నమ్మిన బంట్ల" స్థాయి నుండి ప్రమోటై "ఇద్దరు మిత్రుల" స్థాయికి మారి పోయారు. అన్నా- డిఎంకె పార్టీ, తమిళనాడు ప్రభుత్వాల నిర్వహణకు సంబంధించి ఇద్దరూ కూర్చుని చర్చోప చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం నేపధ్యం లో ఉండి - కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నడుపుతోందని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్-షా స్వయంగా ప్రత్యేక దృష్టి పెట్టటం మాత్రమే కాకుండా, చిన్నమ్మ శశికళను తమ చేతికి మట్టి అంటకుండా, బయటకు విజయవంతంగా గెంటేసి, "ఓపిఎస్ - ఈపిఎస్" లను అదే నమిన బంట్లను, ఒక దారిలోకి వచ్చేలా చేయడంలో కృతకృత్యులయ్యారని మీడియా సంస్థలే కాకుండా, తమిళ నాట ప్రతి నోటా వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో నేటి ఉదయం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అమాయకంగా ఆడువారి మాటలకు అర్ధాలు వేరన్నంత రసవత్తరంగా రాజకీయ నాయకుల మాటల్లో కూడా నర్మగర్భంగా ఏదో మర్మం దాగి ఉన్నట్లు, ఒక ఆసక్తి కరమైన ప్రకటన చేశారు. అదేమంటే "తమిళనాడు రాజకీయాలతో తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలని, వాటిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు ఎంత మాత్రం లేదని" ఆయన తెలిపి ఊర్కుంటే ఆయన వెంకయ్య నాయుడెలా ఔతారు. మరో అర్ధం వచ్చేలా "తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఉంటేనే ఆరాష్ట్ర ప్రజలకు మంచిదని" వ్యాఖ్యానించటం తో జనం ఇందులోని మర్మమేమి తిరుమలేశా అంటూ తిరుమల వైపు చూస్తున్నారు.
అయినా బీజేపీ నేతలే నేపధ్యంలో, అజ్ఞాతంగా తమిళనాడు రాజకీయాలను నడుపుతున్నారని, తమిళనాట ఇప్పటిదాకా అడుగు పెట్టేందుకు కూడా అవకాశం లేని చోట పెద్ద సొరంగమే చేశారని, వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచు కుంటున్నారని అమిత్-షా ఇప్పటికే తమిళ రాజకీయాలను తెరవెనుక నుండి శాసిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్న వేళ, మన వెంకయ్య నోట ఈ పాచిపోయిన పాట వినపడటం ఏమిటని విన్నవారు అంటున్నారు. అయినా వెంకయ్య నాయుడు గారు చేసే వ్యాఖ్యలు "బిహైండ్ ది లైన్స్-బిట్వీన్ ది లైన్స్" తరహాలో అలోచిస్తే తప్ప తత్వం బోధపడదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. అందరూ నమ్మిన బంట్లే కదా! ప్రజలకు పంగనామం పెట్టేయటంలో స్వామిని మించిన బంట్లే! వెంకయ్యా ఒక నమ్మిన బంటే కదా!