కర్ణాటక మైనింగ్ మాఫియా డాన్, మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుదామని నిర్ణయించుకున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో గాలి ఏడాది పాటి జైల్లో కూడా ఉండి వచ్చారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం వైఎస్ తనయుడు జగన్, ఆయన మిత్రుడు గాలి జనార్థన్ రెడ్డి ఆగడాలు ఎలా సాగాయో, అధికారాన్ని వారెలా దుర్వినియోగం చేశారో, ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా కొల్లగొట్టారో మనందరికీ తెలిసిందే.
అయితే ఎవరూ ఊహించని విధంగా వైఎస్ హఠాన్మరణం చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగడంతో ఒక్క సారిగా వీరిద్దరి పరిస్థితులు తారుమారయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరిద్దరిని హస్తం పార్టీ జైలుకు పంపించింది. అప్పటినుంచి గాలి పై ప్రజల ఫోకస్ ఎక్కువైంది. దాదాపు లక్షల కోట్లు గాలి కొల్లగోట్టినట్టు సమాచారం. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలియడంతో ఇక రాజకీయాల్లో పోటీ చేసిన ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం ఆయనకు ఆస్సలు లేదు.
పైగా ఇటీవల జరిపించిన కుమార్తె పెళ్లితో పలు సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పటికే తనపై చాలా కేసులు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.పోటీ చేసి మరిన్ని కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడం ఇష్టంలేకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. మరో సంవత్సరంలో కర్ణాటకలో ఎన్నికలు జరగనుండడంతో జనార్దనరెడ్డి బరిలోకి దిగుతారని అందరూ భావించారు. బళ్లారి, సింధనూరులో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అంతలోనే ఈ నిర్ణయం ఆయన అభిమానులను నిరుత్సాహానికి గురిచేసింది.