ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన అమరావతి ప్రాంత వాసి ఇంటూరి రవికిరణ్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పొలిటిక్ పంచ్ పేరుతో పొలిటికల్ సెటైర్లు వేస్తున్న సోషల్ మీడియా వాలెంటీర్ ఇంటూరి రవికిరణ్ను తుళ్లూరు పోలీసులు శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్ట్ పై పోలీసులు రవికిరణ్ కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీంతో అతని భార్య సుజన ఆందోళన చెందుతున్నారు.
తన భర్తను ఈ రోజు తెల్లవారుజామున 3.30గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా టీమ్ వ్యూహాల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు, వీరికి ఆయన సంస్థ నుంచి వేతనాలు అందుతున్నట్టు విచారణలో తెలుసుకున్న పోలీసులు, ఈ విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
సోషల్మీడియాపై కట్టడి తెచ్చేందుకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అంశాల్ని పరిశీలిస్తోంది. ఫేస్బుక్లోని కొన్ని పేజీలు, వెబ్సైట్లపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఆదేశాల మేరకు ఓ బృందం సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది.