బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి కుట్ర పూరిత నేరం కేసు దర్యాప్తు జరగాల్సిందేనని, అందులో బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి తదితర సీనియర్ నేతలను చేర్చాల్సిందేనని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చిన కేసులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎల్కే అద్వానీ పాత్ర లేదని, ఆ రోజు కరసేవకులను రెచ్చగొట్టింది తానేనని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శిక్ష అనుభవించేందుకు నేను సిద్ధం. ఉరి తీయించుకునేందుకు కూడా రెడీ’ అని అన్నారు. ఆ రోజు మసీదు కూల్చివేత జరుగుతున్నప్పుడు తాను వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్, మహంత్ అవైద్యనాథ్తో ఉన్నానని, తాను మరికొందరితో కలిసి కరసేవకులను రెచ్చగొట్టామని, మరోవైపు జోషీ, అద్వానీ, విజయ్ రాజే సింధియా మాత్రం ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. శాంతియుత పరిస్ధితులు నెలకొల్పేందుకు ప్రయత్నించారు’ అని ఆయన చెప్పారు. బాబ్రీ కేసులో ఈయన పేరు కూడా ఉంది.
ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం బాబ్రీ మసీదు కేసు మళ్లీ తెరపైకి రావడం జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది చాలా సున్నితమైన అంశమే కాక, ఎలాంటి పొరపాటు జరిగినా మతపరమైన ప్రకంపనలు జరిగే అవకాశం కూడా ఉండడంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ విషయం పై ఆచి తూచి అడుగేయడానికి సిద్ధం అవుతుందని స్పష్టంగా అర్థం అవుతుంది.