జగన్ ను వాళ్లు భలే ఇరుకునపెడుతున్నారు.. వాళ్లు అంటే ఇక్కడ శత్రువులు కారు.. వాళ్లు ఆయనకు చాలా ప్రియమైన వారు.. వాళ్లే జగన్ అభిమానులు.. అదేంటో కానీ.. జగన్ ఎక్కడకు వెళ్లినా అభిమానులు చుట్టుముడతారు. గుమిగూడతారు.. అది బహిరంగ సభ కానీ.. ఓదార్పు యాత్రగానీ.. పార్టీ ప్రచార యాత్ర కానీ.. ఏదైనా సరే జగన్ వస్తే చాలు జనం మూగుతారు.
ఇప్పుడు ఈ అభిమానమే జగన్ ను ఇరుకున పెట్టింది. తాజాగా జగన్ చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన లారీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లారు. అది ఓ ఊరినే విషాదంలో ముంచేసిన ఉదంతం.. ఒకరు కాదు ఇధ్దరు కాదు.. పదిహేను మంది ఒకే గ్రామం వాళ్లు ఒకే ప్రమాదంలో మరణించిన విషాద ఘటన.
అలాంటి చోట కూడా జగన్ వచ్చేసరికి వైసీపీ అభిమానలు గుమిగూడారు. అక్కడితో ఆగకుండా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ ను చూసేందుకు ఎగబడ్డారు. జగన్ తో చేయి కలిపేందుకు దూసుకొచ్చారు. అసలే విషాదంలో మునిగిపోయిన వారికి ఈ వైసీపీ కార్యకర్తల హంగామా చూసి కడుపుమండిపోయింది.
మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చారా.. మీ పార్టీ మీటింగ్ కు వచ్చారా అని మండిపడ్డారు. ఇలాంటి ఆర్భాటంతో కూడిన మీ పరామర్శలు మా కొద్దు .. వెళ్లిపోండి అంటూ గ్రామస్తులు ఈసడించకున్నారు. చివరకు తమ పార్టీ కార్యకర్తల అత్యుత్సాహానికి వైసీపీ నేతలు క్షమాపణలు చెప్సుకున్నారు. తమ శ్రేణులను కంట్రోల్ చేసుకున్నారు.