ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలగపూడి లో నిర్మించిన సచివాలయం కేవలం తాత్కాలికమే. ఇదే అద్భుతంగా ఉందని పలువురు నాయకులు, అధికారులు బాబును ప్రశంసించారు. అయితే త్వరలో శాశ్వత భావన ఏర్పాటు నిర్మాణం చేపడుతామని బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించ తలపెట్టిన శాసనసభ భవన నిర్మాణ ఆకృతి విశేషంగా ఆకట్టుకుంటోంది.
శాసనసభ భవనం ఎలా ఉండాలన్నదానిపై ఇప్పటికే ఒక నమూనా రూపొందించిన బ్రిటన్కు చెందిన నార్మన్ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మరో రెండు డిజన్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఒక ఆకృతి రూపొందించిన ఆ సంస్థ, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు మరో రెండు ఆకృతులు రూపొందిస్తోంది. ఈ మూడు ఆకృతులను వచ్చే నెల 10, 11 తేదీల్లో ఆ సంస్థ తీసుకు రానుంది. వాటిలో ఉత్తమమైన దాన్ని ముఖ్యమంత్రి ఎంపిక చేస్తే.. దాని సవివర ఆకృతుల్ని ఆ సంస్థ సిద్ధం చేస్తుంది.
శాసనసభ డిజైన్లపై చర్చించేందుకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్లు ఈనెల 27, 28 తేదీల్లో మరోమారు లండన్ వెళ్లనున్నారు. కాగా నార్మన్ఫోస్టర్ సంస్థ ఇప్పటికే రూపొందించిన ఓ డిజైన్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మూడు లేదా నాలుగు భవంతులు, వాటిపైన చతురస్రాకారపు కప్పు, దానిపైన అత్యంత ఎత్తైన ఒక టవర్ వచ్చేలా ఆకృతి రూపొందించారు. శాసనసభ, మండలి భవనం మొత్తం ఐదెకరాల విస్తీర్ణంలో ఉంటుంది. భవనం ఎత్తు టవర్తో సహా 530 అడుగులు ఉంటుంది. అంటే సుమారు 50 అంతస్తుల ఎత్తుంటుంది.