ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముంబై—పుణె హైవేపై మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు వాట్సాప్లో వదంతులు గుప్పుమన్నాయి. ప్రమాదంలో గాయపడిన ఆయనను స్ట్రెచర్ మీద తరలిస్తున్నట్టు ఉన్న ఈ ఫొటోలు ఫేస్బుక్, వాట్సాప్లలో షేర్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఈ కథనాలపై స్పందించిన ఆయన సన్నిహితులు ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం రాందేవ్ బాబా హరిద్వార్లో నిక్షేపంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు సృష్టించారని చెప్పారు. అయితే ఆయనకు ప్రమాదం జరగిందన్న వార్తలను హైవే కంట్రోల్ ఆఫీసర్లు తోసిపుచ్చడంతో రాందేవ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ముంబై-పూణె హైవేలో అలాంటి ప్రమాద ఘటన ఏదీ చోటుచేసుకోలేదని, ఆ మెసేజ్లన్నీ బూటకాలని అధికారులు తేల్చిచెప్పారు. 'నిజానికి 2011 నాటి ఫోటోలివి. అప్పట్లో రాందేవ్ బాబాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయనను స్ట్రెచర్ మీద బీహార్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఫోటోలే ఇవి' అని అధికారులు తేల్చిచెప్పారు. ఈ వార్తలను నమ్మకూడదని చెప్పారు. తాను క్షేమంగా ఉన్నానంటూ రాందేవ్ బాబా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.