ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో అందజేసే హడ్కో పురస్కారాల్లో ఎక్కువ శాతం కైవసం చేసుకుని మరోసారి సత్తా చాటింది. దేశంలో పట్టణ, మౌలిక సదుపాయాల కల్పనలో విశేష కృషిచేసిన సంస్థలకు కేంద్ర ఈ అవార్డులు ఏటా అందజేస్తుంది.
ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడుఈ పురస్కారాలను అందజేశారు. ఏపీ విషయానికి వస్తే... సీఆర్డేఏకు రెండు అవార్డులు వచ్చాయి. పట్టణ పరిపాలన, భూసమీకరణ విధానంలో ఇవి వరించాయి. అమరావతి ప్రాంతంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా భూసమీకరణ పద్దతిలో సేకరించడం ఈ అవార్డుకు ప్రదాన కారణం.
ఇవే కాకుండా ఏపీ ఆర్టీసీ, మౌలిక వసతుల కల్పన సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్పొరేషన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లకూ అవార్డులు వచ్చాయి. పురస్కార విజేతలను కేంద్రమంత్రి వెంకయ్య అభినందించారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని పిలుపు ఇచ్చారు.
అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా హడ్కో అవార్డులు వరించాయి. తెలంగాణ ఐదు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ప్రతి ఇంటికీ తాగునీరందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి వరుసగా రెండో ఏడాది హడ్కో పురస్కారం లభించింది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాలు ఇలా ప్రగతిపథంలో దూసుకుపోవడం సంతోషదాయకమే.