ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకత్వం తమను ఎన్నుకున్న ప్రజలపై వారి స్వాతంత్రం పై నిరంతర దాడి చేస్తూనే ఉన్నారు. శాసనసభలను కక్షగట్టి నిర్వీర్యం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రత్యేక స్థానమివ్వటం ప్రజాస్వామ్య లక్షణం. ఎందుకంటే ప్రజలు గెలిపించి పాలనా ధికారం ప్రసాధించిన అధికార పార్టీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే సంధర్భాల్లో ప్రజావాణిని దానికి వినిపించి సరైనదారిలో పెట్టటానికి ప్రజలు ప్రతిపక్షానికి అధికారమిచ్చారు. ప్రజలు అధికారమిచ్చిన పార్టీ నాయక త్వం సర్వం సహా సార్వభౌములు ఏనాటికీ కాదు.
తక్కువ సీట్లతో శాసనసభలో కూర్చునే ప్రతిపక్షం నోరు మూసుకోవటానికి కాదు. ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలి వారికి ఆ గౌరవం అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. అంతేకాని వారి తక్కువ సంఖ్యాబలాన్ని చూపి వారినెలాంటి పరిస్థితుల్లొనైనా అధికారపక్షం చిన్నచూపు చూస్తే వ్యతిరేఖ ప్రజాభిప్రాయం బలం పుంజుకొని తదుపరి ఎన్ని కల్లో అధికారపక్షాన్ని అంధకారం లోకి నెట్టే పరిస్థితిలొస్తాయి.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం అధికారపక్షం, ప్రతిపక్ష నాయకుడు ప్రధానిని కలవటం నేరంగా పరిగణించి ప్రతిపక్ష నాయకత్వంపై దాడిచేయటం అత్యంత అనాగరిక చర్య. అసలు అపాయింట్మెంట్ తీసుకొని అతి సాధారణ పౌరుడే ప్రధానికి కలవగల రాజ్యమే ప్రజాస్వామ్యం. ఒకరి ప్రజాస్వామ్య హక్కును పరిహసించటం అత్యంత కౄరాతికౄరూమైన చర్య. అది నేరమైన కలయికైతే ఆ అపాయింట్మెంటును ప్రధాని కార్యాలయం ఇచ్చి ఉండేదికాదు.
దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవలసి రావచ్చు. ప్రభుత్వాలకు నాయకులకు 'సివిక్-సెన్స్' తప్పని సరిగా ఉండాలి. అంతే కాదు ప్రశ్నించినప్పుడు ప్రతిపక్ష నాయకుణ్ణి ఆయన నేరాలను చూపుతూ కించపరచటమంటే ఆయన్ని ఎన్ను కున్న ప్రజల ఎంపికను అవమానపరచటమే.
ఆయన పై ఉన్న నేర అభియోగాలను చట్టం ముందు ఎండగట్టటం ప్రభుత్వ విధి. అది మరచి బ్లాక్ మెయిల్ చేయటం పూర్తి అనైతికం. ఆయన ముద్దాయిగా ఉన్నప్పుడే ప్రజలు ఆయన్ను ఎంపిక చేసుకున్న విషయం మరువరాదు. అంతే కాదు ప్రతిపక్ష సభ్యులను అధికార పార్టీలోకి ఆహ్వానించటం వచ్చిన తరవాత రాజీనామా చేయించకుండా మంత్రి పదవులివ్వటం సామాన్యుడు కూడా తప్పేనని చెప్పగల నేరం. ఆ సామాన్య విషయం కూడా ప్రభుత్వంలోని పెద్దలకు తెలియదా?
ప్రధానిని కలిసిన ప్రతిపక్ష నాయకుడు తప్పుచేశాడని ప్రభుత్వం భావిస్తే, కోటానుకోట్ల భారత ప్రజలు టెలివిజన్లలో చూస్తుండగా ప్రభుత్వ అధినేత ఆదేశం పై ఒక ఎమెల్యే ఒక ఎమెల్సికి ఐదుకోట్ల రూపాయిల లంచం యివ్వజూపిన న్యాయం నైతికత ఎలా ఔతుంది? ఇలాంటి పరిషితులను బేరీజు వేసుకొంటున్న ప్రజల్లో ప్రభుత్వం పట్ల క్రిక్కిరిసిన వ్యతిరెఖత వ్యక్తమౌతుంది. తద్వారా నేరస్తుడుగా ప్రభుత్వం భావిస్తున్న ప్రతిపక్ష నాయకుడు రేపు కథానాయకుడై అధికారంలోకి వచ్చిన వెంటనే జరగనున్న పరిణామాలు ఊహకందవు.
ఒక ఉదాహరణ ను తెలంగాణా నుండి పరిశీలిద్ధాం. ఏపి ప్రభుత్వం కంటే తెలంగాణా ప్రభుత్వం ఏమంత నైతికత సంతరించుకోలేదు సరికదా ప్రజాస్వామ్య లక్షణాలకు వ్యతిరేఖంగా నేరాలు చేయటంలో సమవుజ్జీనే.
ఉదాహరణకు ఒక ప్రతిపక్ష పార్టీ నుండి అధికారపక్షంలోకి జంప్ చేసిన హైదరాబాద్ కు చెందిన ఒక ఎమెల్యే తన పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవి తీసుకొని ఆ పార్టీ నాయకుణ్ణి పరిపరి విధాలుగా పొగిడి మెప్పు పొందే ఆర్భాటం లో ముఖ్యమంత్రిని ఆయన కుటుంబాన్ని ఏకవచనం తో సంభోదిస్తే ప్రజలు "నాలుకలు చీరేస్తా" రని అన్నారు.
ముఖ్యమంత్రిని గౌరవించాల్సిందే. అయినా తెలంగాణాలో ఏకవచన సంభొదన సామాజిక ఆచారమే. సాంప్రదాయమే. అలాంటి దానికి ప్రజలు నాలుకలెలా చీలుస్తారు. నాలుకలు చీల్చటం నేరం కాదా?
తెలంగాణా సాధనకు ముఖ్యమంత్రి లాంటి ఉద్యమ నాయకునికి విజృంబించి విజయం సాధించిన ఉపయోగపడ్డ ధర్నాచౌక్ ను తొలగించటమో తరలించటమో చేస్తేనే ముఖ్యమంత్రి కుటుంబాన్ని అవమానించటమౌతుంది. అంతేకాని ఏకవచన సంబోధన కాదు. ఏకవచన సంభోధన తెలంగాణా ప్రజల ఆచారం, వారు అలా పిలిస్తేనే ముఖ్యమంత్రిని ప్రేమిస్తున్నట్లు. మరి మన పక్క రాష్ట్రంలో ఏకవచన సంబోధన ఆచరణీయం కాదు. బహుశ ఆ మంత్రివర్యులు ప్రక్క రాష్ట్ర అధికార పార్టీ నుండి ఈ రాష్ట్ర అధికార పార్టీలోకి దిగుమతైన సరుకు కదా! అందుకే ఆ నాలుక అలా తిరుగుతుందని అంటున్నారు పలువురు.
విదేశాల్లో ఏకవచన సంబోధన ఆచారం. ప్రజలు బానిసలు కాదు "నీ కాల్మొక్కుత బాంచన్ దొరా!" అనటానికి. ఉద్యమంలో ఉద్యమానికి వ్యతిరెఖంగా పనిచేసిన పార్టీలో ఉండి అవసరానికి ముఖ్యమంత్రి పంచన చేరిన ఆ మంత్రివర్యునికి మాత్రమే ఏకవచన సంబోధన నేరం. ఆయన అలాచేస్తే మాత్రమే ఆయన నాలుక చీల్చేయవచ్చు.