ఏపీ ముఖ్యమంత్రి కి సదస్సులు నిర్వహణ చెయ్యడం, వీడియో కాన్ఫరెన్స్ లూ , టెలీ కాన్ఫరెన్స్ లూ అంటే విపరీతమైన ఇష్టం. క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగా చేపడుతూ విసిగిస్తారు అనే పేరున్న చంద్రబాబు ఆ పేరు కలక్టర్ ల సదస్సులో కూడా నిలబెట్టుకున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కంటే అవగాహన కల్పించడానికి ఆయన ఈ సారి అగ్ర తాంబూలాన్నిచ్చారు. ఆయన మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకునేందుకు సాధారణంగా ఎవరూ సాహసించరు.
ఈ పర్యాయం పరిస్థితి మారింది. ఆయన తనయుడూ, ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే…తన అభిప్రాయాలనూ.. సూచనలు వెల్లడించారు.
ఆయన శాఖలే కాక ఇతర శాఖలపై చర్చ సమయంలో కూడా లోకేశ్ జోక్యం చేసుకుని తన పరిజ్ఞానాన్ని చాటుకున్నారు.ఐటీ కంపెనీల ఏర్పాటుకు నగరాల పరిథిలోనే స్థలాలు కేటాయించాలని సూచించారు నారా లోకేశ్.
దీనివల్ల ఉద్యోగులకు ఇబ్బందులు తగ్గుతాయనీ, ఊరికి దూరంగా స్థలాలిస్తే..రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆయన చెప్పిన సూచనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు మాట్లాడుతున్న సమయంలో జోక్యం చేసుకుని తాను చెప్పదలచుకున్నదీ.. సూచించుకున్న మార్పులనూ విస్పష్టంగా తెలిపారు.