తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో అట్టహాసంగా 'మహానాడు' నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది టీడీపీ కార్యక్తలు తరలి వచ్చారు. ఎంతో సందడిగా సాగుతున్న కార్యక్రమంలో ఓ మహిళా నాయకురాలు మాత్రం అలకబూనారు. అధికారంలో వుంది గనుక, మొత్తం అధికార యంత్రాంగాన్ని అక్కడే మోహరించి, మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహణలో మునిగి తేలుతోంది పసుపుదళం.
ఈ మూడు రోజులు 'మహానాడు' వేదిక నుంచే పాలన.. అనే స్థాయిలో ఇప్పటికే సంకేతాలు కూడా పంపేసింది తెలుగుదేశం పార్టీ. అయితే గత కొంత కాలంగా ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకున్నవారికంటే, కొత్తగా పార్టీలోకి వచ్చినవారి హవానే ఎక్కువగా కన్పిస్తోంది. తాజాగా మహానాడులో టీడీపీ నేత, సినీ నటి కవిత అలిగారు.
మహానాడుకు హాజరైన తనను వేదికపైకి పిలవలేదంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆమె మహానాడు ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేదికపై కూర్చోబెట్టారని, అధికారంలోకి వచ్చాక అవమానిస్తున్నారని కవిత మీడియా ముందు వాపోయారు.