తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. కేవలం సినిమాల్లోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించారు. కాకపోతే ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపి, బిజెపికి మద్దతు ఇచ్చారు. తర్వాత ప్రజా పక్షాన నిలబడి పోరాడుతున్నారు. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ వచ్చే ఎన్నికల్లో నిలబడతానని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి బరిలో దిగుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు అప్పుడే వ్యతిరేక పవనాలు వీచడం మొదలయ్యాయి. స్వార్థ రాజకీయాల కోసం, కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే పవన్ రాజకీయాలు మాట్లాడుతున్నారని రాయలసీమ రాష్ట్ర సమితి(ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో కుంచం వెంకట సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పాలకులందరూ సీమ ప్రజలను వాడుకున్నారు.
అయితే సీమ ప్రజలు వారు చేసేందేమీ లేదని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ సైతం అదేధోరణిలో నడుస్తున్నారని విమర్శించారు. గతంలో పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి సీమ నుంచి గెలిచి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. టీజీ వెంకటేష్ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిమాండ్ చేశారని కానీ ఎంపీ అయిన తర్వాత నోరు మెదపడం లేదని అన్నారు.
ఇదే తరహాలోనే బీజేపీ, టీడీపీకి కొమ్ముకాస్తున్న పవన్ కల్యాణ్ను సీమలో తిరగనిచ్చేది లేదని కుంచం హెచ్చరించారు. గతంలో చిరంజీవి ఇలానే పోటీ చేసి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని.. ఇప్పుడు పవన్ న్యాయం చేస్తాడనే ఆలోచన లేదని ఆయన అన్నారు.