ఇండియాను ఇప్పుడు మరో వైరస్ వణికిస్తోంది. ఇటీవలే వాన్నా క్రై వంటి సాఫ్ట్ వేర్లు, హ్యాకర్ల కారణంగా పలు వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి. కానీ ఇప్పుడు మరో వైరస్
వేధిస్తోంది. కాకపోతే ఇది సాఫ్ట్ వేర్ రంగం నుంచి కాదు.. బయాలజీ నుంచి.. ఔను మరి ఆరోగ్యమే మహా భాగ్యం కదా.. అదంటూ ఉంటేనే కదా.. మనం ఎన్ని వేషాలైనా వేసేది.
కానీ ఇప్పుడు కొంతకాలం క్రితం.. ప్రపంచాన్ని గడగడలాడించిన జికా వైరస్ ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. మనదేశంలో మూడు జికా వైరస్ కేసులు నిర్ధారించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. ఈ మూడు కేసులన్నీ గుజరాత్ లో ఈ ఏడాది జనవరిలో నమోదైనట్టు తెలిపింది.
అహ్మదాబాద్ బాపూనగర్ కు చెందిన వీరిలో ఒక గర్భిణి కూడా ఉన్నట్టు వివరించింది. తొలిసారి అహ్మదాబాద్ లోని బీజే వైద్య కళాశాలలో పరీక్ష ద్వారా జికా వైరస్ ను
గుర్తించారు. దాన్ని నిర్ధారించుకునేందుకు పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. జనవరి నాలుగో తేదీన అది జికా వైరసేనని NIV ప్రకటించింది.
ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య సేకరించిన రక్త నమూనాల్లో 64 ఏళ్ల ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. అయితే భారత్ పై ఎలాంటి ప్రయాణ, వాణిజ్య ఆంక్షలను మాత్రం విధించలేదు. సకాలంలో ఈ వైరస్ ను అరికట్టే మార్గం చూడకపోతే.. దాని పర్యవసనాలు దారణంగా ఉండబోతున్నాయా..?