ప్రతి ఏటా మేలో తెలుగుదేశంపార్టీ మహానాడు నిర్వహిస్తుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినమైన మే 28 న మహానాడు జరుగుతుంది. ఇది ఆరంభం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తప్పక హాజరవుతుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ హాజరుకాకుండానే మహానాడు జరిగిపోయింది.
ఎన్టీఆర్ కుటుంబం నుంచి హరికృష్ణ ఇప్పటికీ పార్టీలోనే ఉన్నా పెద్దగా క్రియాశీలకంగా లేరు. కానీ మహానాడుకు మాత్రం తప్పకుండా హాజరవుతుంటారు. కానీ ఈసారి ఆయన రాలేదు. ఇక మరో కుమారుడు నందమూరి బాలకృష్ణ ఏకంగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా మహానాడుకు మాత్రం ఈసారి హాజరుకాలేదు. గతంలో మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ , తారకరత్న వచ్చేవారు.
2, 3 సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రావడం మానేశారు. ఇలా ఒక్కొక్కరుగా మహానాడుకు రాలేకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కుటుంబంలో ఎవరూ రాలేదేమిటా అన్న చర్చ వినిపించింది. ఐతే బాలయ్య మాత్రం తాను విదేశాల్లో సినిమా షూటింగ్ లో ఉన్నందువల్ల రాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నారు.