వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నందమూరి లక్ష్మీపార్వతి.. ఈమె ఎప్పుడు వైసీపీ అధ్యక్షురాలైందని ఆశ్చర్యపోతున్నారా.. నిజం కాదు లెండి.. కానీ వైసీపీకి లక్ష్మీ పార్వతిని అధ్యక్షురాలిని చేయాలని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ కు సూచించారు. ఇందులో ఏం లాజిక్ ఉంది అనుకుంటున్నారు.. ఆ లాజిక్ ఏంటో ఆయనే చెబుతారు.
అసలింతకూ ఈ వివాదం ఏంటంటే.. మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్టీఆర్ కు గతంలో టీడీపీ నేతలు చేసిన ద్రోహాలను గుర్తు చేశారు. ప్రత్యేకించి రోజా.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలా మానసిక క్షోభకు గురయ్యారో కూడా చర్చించివుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్కు భారతరత్నను సాధించడంలోనూ టీడీపీ సరిగా ప్రయత్నాలు జరపడం లేదని రోజా దుయ్యబట్టారు. దీనికి బదులిచ్చిన సోమిరెడ్డి.. జగన్ కు ఎన్టీఆర్ పైన అంత ప్రేమ ఉంటే.. లక్ష్మిపార్వతిని తమ పార్టీ అధ్యక్షురాలుగాప్రకటించుకోవచ్చునని ఎద్దెవా చేశారు. మూడు దశాబ్దాలకుపైగా లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జీవితాలు ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నాయని సోమిరెడ్డి అన్నారు.
ఒక నిజాయతి పరుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీపై లక్షల కోట్లు అవినీతిపై నుంచి పుటిన వైసీపీ విమర్శలు చేయటమేమిటని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ సమస్యపైనా అధ్యయనం చేయాని వైసీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. 50 వేల మందితో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీదేనని సోమిరెడ్డి తెలిపారు.