నరేంద్ర మోడీ.. ఇంతటి చురుకైన ప్రధానమంత్రి బహుశా భారత దేశం ఇంతవరకూ చూడలేదేమో అనిపించేలా పర్యటనలు సాగిస్తున్నారు. ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి ఎన్నో దేశాలు తిరిగారు. అసలు భారత ప్రధానులు ఇంతవరకూ అడుగు పెట్టని దేశాలకూ వెళ్లారు. విదేశాంగ విధానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి విదేశీ బాట పట్టారు.
నేటి నుంచి మొత్తం ఆరు రోజులపాటు జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక బంధాల బలోపేతమే ఈ పర్యటన టార్గెట్స్. మొదట జర్మనీ వెళ్లనున్న మోడీ కీలక రంగాల్లో సహకారం పెంపుపై ఆ దేశ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో చర్చలు జరుపుతారు. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మీయర్తోనూ మోడీ మంతనాలు జరుపుతారు.
ఆ తరవాత బెర్లిన్లో ఎంఎన్సీ కంపెనీలతో భేటీ అవుతారు. భారత్-జర్మనీ ఆర్థిక బంధం బలోపేతానికి కృషి చేస్తారు. మంగళవారం స్పెయిన్ కు వెళ్తారు. విశేషం ఏంటంటే.. గత 30 ఏళ్లలో ఆ దేశానికి వెళ్లిన తొలి భారత ప్రధాని మోడీయే. ఇదో రికార్డు. స్పెయిన్ అధ్యక్షుడు మరియానో రాజోయ్తో చర్చలు జరుపుతారు. ఆ దేశ రాజు ఫిలిప్-సిక్స్నూ కలుస్తారు.
స్పెయిన్కు చెందిన దిగ్గజ సంస్థల సీఈవోలతో మోడీ భేటీ అవుతారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకున్న అపార అవకాశాల్ని వివరిస్తారు. అక్కడి నుంచి ఈనెల 31న రష్యా చేరుకుంటారు. సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగే భారత్-రష్యా 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరుపుతారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. చివరగా ఫ్రాన్స్ వెళ్తారు. ఆ దేశ కొత్త ప్రెసిడెంట్ ను కలుస్తారు.