అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు. అంతా హిల్లరీకే పట్టం అంటూ ఊదరగొట్టారు. ప్రసార మాధ్యమాలన్నీ హిల్లరీ గెలుస్తుందని కచ్చితంగా చెప్పేశాయి. ట్రంప్ ను ఓ జోకర్ గా భావించాయి. కానీ ఏమైంది ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిపోయాడు. ఇప్పుడు సేమ్ సీన్ రిపీటవుతుందట.
టీఆర్ఎస్ సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరహాలో వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రతిపక్షనేత జానారెడ్డి అంటున్నారు. ఈ సర్వేలేవీ వాస్తవిక ప్రజా అభిప్రాయాన్ని ప్రతిబింబిచలేవని ఆయన చెబుతున్నారు. అసలు ఈ సర్వే ఫలితాలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.
మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో రైతాంగ సమస్యలు, ప్రజా సమస్యలను ఒకటో తేదీన జరిగే సంగారెడ్డి ప్రజాగర్జన సభలో వివరిస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు, ఆందోళనలను సర్వేల పేరుతో ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ప్రజా స్వామ్య పరిరక్షణకు 2019 లో కాంగ్రెస్ కు ప్రజలే పట్టం కడతారని జానారెడ్డి నమ్మకంతో ఉన్నారు. ఆయన నమ్మకం నిజమవుతుందా.. ?