విశాఖలో ఇటీవల తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు మూడు రోజుల పాటు వైభవంగా సాగింది. ఎన్టీఆర్ జయంతి వేళ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎప్పటిలాగానే ఆయనకు భారత రత్న ఇవ్వాలని పార్టీ తీర్మానం కూడా చేసింది. మరి ఇక ఎన్టీఆర్ ను చంద్రబాబు అవమానించడం ఏముంటుంది.. అనుకుంటున్నారా..
ఐతే.. నాయకుల ప్రసంగాలు మెరుగుపరుచుకునే విషయంలో చంద్రబాబు సలహాలు ఇస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. నాయకులు ఆకట్టుకునేలా ప్రసంగించడం నేర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా కొన్నిచిట్కాలు వారికి చెప్పే ప్రయత్నం చేసారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ గత ప్రసంగాలపై ఆయన కామెంట్లు చేశారు.
ప్రజల్లో ప్రసంగించడం మొదట్లో ఎన్టీఆర్ కు కూడా వచ్చేది కాదని.. కానీ ఆయన ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేశారని చంద్రబాబు అన్నారు. అంతవరకూ ఓకే.. కానీ ఎన్టీఆర్ నోట్లో గులకరాళ్లు వేసుకుని మాట్లాడటం ప్రాక్టీస్ చేశారని చంద్రబాబు చెప్పారు. అసలు ఎన్టీఆర్ ప్రసంగ ధాటి అందరికీ తెలిసిందే. ఆయన మైక్ అందుకునే మాటలు వాటికవే తన్నుకు వచ్చేవి. అలాంటి ఎన్టీఆర్ కు మాట్లాడటం రాదని.. నోట్లో గులకరాళ్లు వేసుకున్నారని చెప్పడం ఎన్టీఆర్ అభిమానులను మనస్తాపానికి గురిచేస్తోంది.