ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోడీని కలసి దాదాపు 20 రోజులు దాటిపోయినా ఈ భేటీపై ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏఐసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజు జగన్ తీరును విమర్శించారు. కొప్పుల రాజు రాహుల్ గాంధీకి సన్నిహితుడని చెబుతుంటారు. ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని చెప్పిన జగన్... మోదీని వద్ద నుంచి రాష్ట్రం కోసం ప్రత్యేక హాదా విషయం పై ఎటువంటి హామి పొందారని కొప్పుల రాజు ప్రశ్నించారు.
కొప్పుల రాజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు మృతికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జూన్4 గుంటూరు లో జరగనున్న ప్రత్యేక హాదా భరోసా సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను రాజు ఆవిష్కరించారు.
అనంతరం కొప్పుల రాజు మాట్లాడుతూ... టీడీపీ , వైసీపీ లు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని ప్రధాన పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హాదా సాధించుకొనేంత వరకు పోరాడుతుందని అన్నారు . జూన్ 4 తేదిన గుంటూరులో జరగనున్న ప్రత్యేక హోదా భరోసా సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు అఖిల పక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు.