బాహుబలి విజయం సినీప్రియులకు ఆనందాన్నిస్తే.. మన ఇస్రో బాహుబలి ప్రయోగం దేశ శాస్త్రసాంకేతిక రంగాలకు కొత్త ఊపు ఇవ్వబోతోంది. వరుస ప్రయోగ విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో మరో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతోంది. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన భారీ ఉపగ్రహం జీఎస్ఎల్వీ మార్క్3-డీ1ని (జీ శాట్ -19) అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టేందుకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు సిద్దం చేసారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఈనెల 5వ తేదీ ఈభారీ ఉపగ్రహం పంపేందుకు శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. 5వ తేదీ సాయంత్రం 5.28 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్3-డీ1ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి సంబందించి 4వ తేదీ కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అనుసంధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
శనివారం ఉపగ్రహం ప్రయోగ వేధికకు చేరనుంది. ఈ జీశాట్-19 ఉపగ్రహం బరువు 3,136 కిలోలు. శ్రీహరికోట ‘షార్’ నుంచి ఇస్రో అత్యంత బరువు కలిగిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టటం ఇదే తొలిసారి. ఈ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్య లో ప్రవేశ పెడతారు. అయితే ముందుగా ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి ఆ తరువాత మూడు దశల్లో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడతారు. కమ్యునికేషన్ రంగానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. మరి భళా ఇస్రో అని మనమూ నినదిద్దామా..?