తెలంగాణ కల సాకారమై దాదాపు 3 సంవత్సరాలు కావస్తోంది. మూడో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. కేసీఆర్ సర్కారు కూడా ఈ సంబరాలలను వీలైనంత గ్రాండ్ గా జరపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు అదిరిపోయేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.
అంతవరకూ బాగానే ఉంది. కానీ తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన అమర వీరుల కుటుంబాలపై కేసీఆర్ సర్కారు కరుణచూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదే అంశాన్ని అస్త్రంగా మలచుకుంటున్నారు తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసిన అమరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు నాలుగు పేజీల సుదీర్ఘమైన అస్త్రం సంధించారు. ఎల్బీ నగర్లో శ్రీకాంతా చారి ఆత్మహత్య చేసుకున్న డిసెంబరు 3వ తేదీని తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాలని లేఖలో కోరారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ నగరంలో అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు.
అమరుల స్మృతి కేంద్రం, త్యాగజ్యోతి టైమ్ లైన్ వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. 31 జిల్లాల్లో అమరుల పేరిట స్తూపాలను నిర్మించాలన్నారు. 1569 మంది అమరుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలన్నారు. ఉద్యమ సమయంలో నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని కోరారు. బోళాశంకరుడిగా పేరున్న కేసీఆర్ ఈ విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తారా..?