వైసీపీ నాయకురాలు రోజా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నవనిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు 7 రోజుల పాటు చేస్తున్న దీక్షలపై రోజా మండిపడ్డారు. హైదరాబాద్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఉగ్రవాదంపై పోరాడుతున్నామని బిన్లాడెన్ చెప్పినా... రాక్షసత్వం నశించాలని రావణాసురుడు ప్రతిజ్ఞ చేసినా ఎలా నవ్వుకుంటారో.. అవినీతిపై పోరాడుదామని చంద్రబాబు ప్రమాణం చేస్తున్నా.. అదే విధంగా నవ్వుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు.
బాబు మాటలు మిలీనియం జోక్ ఉందన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పక్క రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటుంటే... రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టించింది చాలక ఏడు రోజుల నవనిర్మాణ దీక్ష అంటున్నావంటే.. ఒక ఇంట్లో ఏదైనా చెడు జరిగితే మనం పండుగలు చేసుకుంటామా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఏపీ నదులను, ఆస్తులను, ఆఖరికి రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టి కొత్తగా దీక్ష పేరుతో ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావా చంద్రబాబు అని రోజా నిలదీశారు.
చంద్రబాబు చేసే దీక్ష నారావారి నయవంచన దీక్ష, నారావారి విధ్వంసపు దీక్ష అని ఆరోపించారు. రాష్ట్రం అవినీతి రహితంగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండకూడదని రోజా అన్నారు. చంద్రబాబు.. ఆయన కుబుంబ సభ్యులు అవినీతి మానేస్తే... మిగితా వారు కూడా అవినీతి పనులు చేయరని చెప్పారు. ప్రజల సొమ్ముతో విదేశాల్లో జల్సా చేయడంలో చంద్రబాబు అగ్రస్తానంలో నిలిచారని ఆరోపించారు. బాబు అవినీతి పై విచారణ జరిగితే వెయ్యెళ్ల జైలుశిక్ష పడుతుందని తెలిపారు.
బాబు చేసేది నవనిర్మాణ దీక్ష కాదని...నారా వారి నయవంచన దీక్ష అని రోజా విమర్శించారు. తన కుటుంబం అవినీతికి పాల్పడలేదని కాణిపాకం వినాయకుడి పై ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. నవనిర్మాణ దీక్ష పేరుతో మరోమోసానికి తెరలేపారన్నారు. బాబు చేసిన పాపాలు కడుక్కోవడానికి జగన్ నామ స్మరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ సవాల్ చూస్తే మహేష్ బాబు సినిమా డైలాగుల్లా ఉన్నాయని ఆరోపించారు.