ఏపీ మంత్రి నారా లోకేశ్ కూ... సినీ నటుడు మహేశ్ బాబుకూ పోలికేంటి అనుకుంటున్నారా.. రాజకీయ నాయకులు విమర్శలకు దిగితే ఎలాంటి పాయింట్లైనా లాగుతారు.. వైసీపీ నేత రోజా ఇదే నిరూపించారు. చంద్రబాబు చేపట్టిన నవనిర్మాణ దీక్షపై విమర్సించిన రోజా పనిలో పనిగా నారా లోకేశ్ పైనా కామెంట్ల వర్షం కురిపించారు. ఆయన్ను సినీ నటుడు మహేశ్ బాబుతో పోల్చారు.
మొన్న మహానాడులో నారాలోకేశ్ వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. తన అవినీతి నిరూపించాలన్నారు. దీనిపై స్పందించిన రోజా.. లోకేష్ సవాలు చూస్తుంటే సినీహీరో మహేష్బాబు సినిమాలోని డైలాగ్ గుర్తొస్తుందన్నారు. ‘డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడకొట్టినట్లుగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సొంతంగా పార్టీ పెట్టుకొని 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వైయస్ జగన్ ఎక్కడా.. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ ఎక్కడా..? అని ధ్వజమెత్తారు.
మూడు రోజలు పాటు సాగిన మహానాడులో చేసిన, చేయబోతున్న పనుల గురించి చెప్పుకోకుండా టీడీపీ నేతలంతా వైయస్ జగన్ స్మరించుకున్నారన్నారు. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీనే బాబుతో పొత్తుపెట్టుకుంటే బస్మాసురుడితో పెట్టుకున్నట్లేనని ఫ్లకార్డులు పట్టుకొని విజయవాడలో ఆందోళనకు దిగారన్నారు. మిత్రపక్షమే ఛీ కొట్టినా చంద్రబాబు సిగ్గులేకుండా దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మంచి చేసి అభిమానం పొంది ఎన్నికల్లో గెలుద్దామని లేదు కానీ, ఎన్ని నోట్లు పంచుదాం.. ఎన్ని ఓట్లు కొందాం.. అవినీతి సంపాదనతో అధికారాన్ని ఎలా కొందామనే ఆలోచనే టీడీపీ సర్కార్లో ఉందన్నారు.