ఇప్పుడు దేశంలోనే రాజకీయ కురువృద్ధుడు ఎవరంటే గుర్తొచ్చేపేరు కరుణానిధి. 94 ఏళ్ల వయస్సులోనూ చురుగ్గానే ఉంటారు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు దేశంలోని రాజకీయ దిగ్గజాలు తరలివచ్చారంటే ఆయన ఖ్యాతి ఏంటో చెప్పుకోవచ్చు. తమిళనాడులో ఎక్కువకాలం రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు కరుణానిధి.
సినీరచయితగా పేరు సంపాదించిన కరుణానిధి.. తమిళనాట జరిగిన ద్రావిడ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి నాస్తికవాదంవైపు మొగ్గారు. తమిళ రాజకీయాలంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు రెండే కరుణానిధి, జయలలిత. అంతగా వారు ప్రభావితం చేశారు.
అయితే కరుణానిధి మూలాలు తెలుగు నేలవైపే ఉండటం విశేషం. ఆయన తమిళనాడులో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి చెందినవారు. కరుణానిధి పూర్వీకులది ప్రకాశం జిల్లా. ఆయన అసలు పేరు దక్షిణామూర్తి. ఆ మాటకొస్తే తమిళనాడులోని ప్రముఖ అగ్రనేతలంతా పూర్తిగా తమిళులు కాకపోవడం విశేషమే. జయలలిత కన్నడిగురాలు. రజినీకాంత్ కూడా అంతే.