దర్శకరత్న దాసరి నారాయణరావు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు, అంతిమ యాత్రకు చిత్ర పరిశ్రమ తరలివచ్చింది. ఘనంగా తుది వీడ్కోలు పలికింది. ఐతే.. దాసరి నారాయణరావు చేత సహాయం పొందిన ఎందరో నటులు, నటీమణలులు ఆయన్ను కడసారి చూసేందుకు కూడా రాకపోవడం వివాదంగా మారింది.
ఈ అంశంపై దాసరి శిష్యుడు, ఆప్తుడు మోహన్ బాబు ఘాటుగా స్పందించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారిని విశ్వాస ఘాతకులుగా అభివర్ణించారు. దాసరి సినీ పరిశ్రమలో ఎంతో మందికి సహాయం చేశారని... ఎన్నో ఇళ్లలో దీపం వెలిగించారని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. ఆయన ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు... మరి, ఆయన చనిపోయినప్పుడు ఎంత మంది వచ్చారో లెక్కిస్తే, గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సపోర్టింగ్ పాత్రలు చేసుకునే ఎంతో మందిని ఆయన హీరోలుగా చేశారని... ఎంతో మంది హీరోయిన్లకు గుర్తింపును తీసుకొచ్చారని మోహన్ బాబు తెలిపారు. తాను ఎవరి పేరును చెప్పనని... కానీ, వారు చేసింది మాత్రం చాలా దారుణమని అన్నారు. ఊర్లో లేనివారి గురించి మనం మాట్లాడకూడదని... కానీ, అందుబాటులో ఉండికూడా, రాకపోవడం సరైనది కాదని మోహన్ బాబు తప్పుబట్టారు.