బ్రాహ్మణ కార్పొరేషన్ పదవినుంచి తొలగించడంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిం చారు. ఆయన మంగళవారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్-క్లబ్లో మీడియా సమావేశంలో తన ఫేస్-బుక్లో పోస్టులపై వివరణ ఇచ్చారు. "నన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించారని విన్నాను. అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. తనను ఆ పదవి నుంచి తీసేశారని టీవీలో చూశాను. సీఎం కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ నాకు ఎలాంటి ఫోన్ రాలేదు. వివరణ అడగలేదు, అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని" అని కృష్ణారావు అన్నారు.
నన్ను రాజీనామా చేయమని అడిగేవారిని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. నాకు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంత వరకూ వివరణ అడగలేదు. ముఖ్యమంత్రిని కలవడానికి ఆరు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా, కానీ ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదు. నా "ఇగో-హర్ట్" అయిందని అధికారులకు చెప్పాను. నేను జవాబుదారీ తనంతో పని చేయడం లేదన్న విమర్శలు అవాస్తవం.
నా మీద పెద్ద అభాండం వేశారు.
నాకు కేబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా
నాకు రెండు లక్షల జీతం అని కూడా ప్రచారం చేస్తున్నారు. నేను జీతం లేకుండా పనిచేస్తున్నా.
అయితే కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నాను.
1.బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి కావాలని నేనే అడిగి తీసుకున్నా. నా విజ్ఞప్తికి ఒప్పుకునే ఆ పదవి ఇచ్చారు. బ్రాహ్మణ కార్పోరేషన్ లో చాలామంది తెలుగు దేశం వారే వారే సభ్యులుగా ఉన్నారు. ఏ సమాచారం ఉన్నా నేనువారికి చెప్పేవాడిని. బ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశం సమాచారం ఇవ్వడంలేదని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఆ మెసేజ్లు పంపించే వ్యక్తులు కూడా టీడీపీ కార్యకర్తలే. వాళ్ల నుంచి మెసేజ్లు వెళ్లలేదంటే పార్టీలో ఏదో సమస్య ఉన్నట్లే అనిపిస్తుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఋణాలు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని చెబుతున్నారు. అలాంటి ఆరోపణలపై నాకు అభ్యంతరాలున్నాయి.
2.లబ్దిదారుల్లో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ ఉండరు. లబ్దిదారుడు మాత్రమే ఉంటాశు. జన్మభూమి కమిటీల ప్రమేయం లేకండా లబ్దిదారులను ఎంపిక చేశాం. లబ్దిదారులకు, పార్టీకి ముడి పెట్టడం సరికాదు. విశాఖలో రెండు సత్రాలను బ్రాహ్మణులకు ఇస్తూ దేవాదాయశాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ప్రచారానికి రమ్మని బీజేపీ మంత్రి అడిగారు. నేను వెళ్లాను. సత్రం క్రెడిట్ సీఎం చంద్రబాబుకే ఇచ్చా. ఇప్పటివరకూ ప్రచారం గురించి ప్రశ్నించని వ్యక్తలు, ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారో? అర్థం కావడం లేదు.
3.ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశం కాని అంత అంగబలం, అర్థబలం గాని నాకు లేవు. సీ.ఎస్గా పని చేసి అన్ని అనుభవించిన వ్యక్తిని ఎమ్మెల్యే కావాలని కోరుకుంటానా? ఎమ్మెల్యే పదవో, ఇంకేదో నేను ఆశించలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ను ఆర్తులైన వారికి అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలన్నదే నాలక్ష్యం. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నేను జీతమేమీ తీసుకోవడంలేదు. ఏం తప్పు చేశానని నాపై అభాండాలు వేస్తున్నారో తెలీదు.
4.జేసీ దివాకర్ రెడ్డి విషయంలో నేను స్పందించిన దాంట్లో తప్పేమీ లేదు. జాతీయ స్థాయి నాయకులు సర్పంచ్ స్థాయి దాటలేదని నేను స్పందించా. నాపై రియాక్ట్ అయిన వ్యక్తి ఒక టీడీపీ కార్యకర్త. ఇక పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్ విషయంలో నేను చాలాఫీలయ్యాను. ఫేస్-బుక్ ఉన్నదే అభిప్రాయాలు చెప్పడానికి. డొనాల్డ్ ట్రంప్, విజయ్ మాల్యా నుంచి శ్రీకాకుళం అరటిపండు వరకూ నేను అన్నింటిపై స్పందించా.
5.గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని పోస్ట్ పెట్టాను. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నా. చరిత్రను వక్రీకరించిన సినిమాకు పన్ను రాయితీ ఎలా ఇస్తారు?
6.అలాగే టీటీడీ ఈవో దక్షిణాది వ్యక్తికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తరాది వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏముందని నాకనిపించింది.
7.పొలిటికల్ మైలేజ్ రావడం లేదని నాపై పెద్ద అభాండం వేశారు. పొలిటికల్ మైలేజ్ రావాలంటే భజన చేయాలా? నేను అలాంటి వ్యక్తిని కాను. భజన కావాలనుకంటే అలాంటి వ్యక్తిని పెట్టుకోవాల్సింది.
తటస్థ సమాచార వ్యవస్థ లేకపోవటంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు నిజాలు వెళ్లడం లేదు. ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ను లగడపాటి రాజగోపాల్ కలిస్తే తప్పులేదు కానీ, నేను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పా? బాపట్లలో స్థానిక ఎమ్మెల్యేను కలవడంలో తప్పేముంది. ఏపీ రాజధాని భూములపై త్వరలో పుస్తకం రాస్తా. అన్ని విషయాలను అందులో వెల్లడిస్తా. అని ఐవైఆర్ కృష్ణారావు ముగించారు.