ఈ మద్య సినిమాల ప్రభావం మంచికి ఎంత సహకరిస్తుందో తెలియదు కానీ...చెడు మాత్రం బాగా నేర్చుకుంటున్నారు యువత. ఆ మద్య ఓ సినిమా చూసి అచ్చం ఆ సినిమాలో మాదిరిగానే కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు వెల్లడించారు..ఇలాంటి సంఘటనలు నిత్యం ఎన్నో చూస్తున్నాం. తాజాగా అచ్చం సినిమా స్టైల్లో ఓ టివి ఆర్టిస్టుని ఒక కీచకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని నిర్బంధించాడు.
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రూప అనే టీవి నటితో ఓ స్నేహితుడి ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది. గతేడాది నవంబర్ లో వీరి మధ్య పరిచయం ఏర్పడగా.. రూప అవసరార్థం ఇటీవల అతను రూ.1లక్ష అప్పు ఇచ్చాడు. ఈ అప్పుకు సంబంధించి.. ష్యూరిటీ పేపర్స్ పై సంతకాలు చేయాలని చెప్పి రూపను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక.. కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి ఆమె చేత తాగించాడు. ఆపై ఆమె స్పృహ కోల్పోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు.
అదే స్థితిలో ఆమె ఫోటోలు చిత్రీకరించి.. అప్పటినుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి తను చెప్పినట్లు వినాలని లేదంటే ఆ ఫోటోలు, వీడియో నెట్ లో పెడతానని చెప్పి పలు మార్లు తన కామ వాంఛ తీర్చుకుంటూ వస్తున్నాడు. రూప మెడలోని బంగారు గొలుసును లాక్కుని.. దాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1.1లక్ష నగదు రుణంగా తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఇక అతని వేధింపులు భరించలేక రూప.. అక్కడినుంచి తప్పించుకుని ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నాడు.