ప్రపంచంలో ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజు కీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యువతను తమవైపు ఆకర్షించుకోవడానికి రక రకాల పన్నాగాలు పన్నుతున్నారు. హైదరాబాద్లో పట్టుబడ్డ ఐసిస్ సానుభూతిపరుడు ఒమర్ అలియాస్ కొనకళ్ల సుబ్రహ్మణ్యం వ్యవహారాలపై రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నారు. కౌంటర్ ఇంటిలిజెన్స్కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక పోలీస్ బృందం ఒమర్ స్వగ్రామం కృష్ణాజిల్లా చల్లపల్లికి వెళ్లి విచారించారు.
కొనకళ్ళ సుబ్రహ్మణ్యం (ఒమర్) గత చరిత్ర గురించి తెలుసుకునేందుకు జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు చల్లపల్లి మండలంలోని కొత్తమాజేరులో సుబ్రహ్మణ్యం మూలాలను కనుగొన్నారు.సుబ్రహ్మణ్యం (ఒమర్) తండ్రి నరసింహారావు పెద్ద కుమారుడు ప్రస్తుతం పంజాబ్లో ఇంజనీరింగ్ పూర్తి చేయగా, రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యం డిగ్రీ లోనే దారి తప్పి ప్రస్తుతం పోలీసులకు చిక్కాడు. సుబ్రహ్మణ్యం మతమార్పిడి చేసుకొని ఒమర్గా మారేందుకు పదో తరగతి నుంచే ప్లాన్ చేసుకున్నాడు.
ఏపీలోని మచిలీపట్నంలో పదో తరగతి చదివే సమయంలోనే ఇతని స్నేహితులను చూసి, మరో వర్గానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలకు ఆకర్షితుడయ్యాడు. ఇంటర్మీడియట్లో కొంతమంది స్నేహితులతో మాత్రమే తిరిగేవాడని, ఇతరులతో మాట్లాడేవాడు కాదని స్థానికులు చెప్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరి, మధ్యలోనే చదువు ఆపేశాడు. తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయి ఒమర్గా పేరు మార్చుకున్నాడు.
15 రోజుల కిందట సొంతూరికి వచ్చిపోయాడని, వారంనుంచి ఆచూకీ తెలియడంలేదని ఒమర్ కుటుంబసభ్యులు వెల్లడించారు.ఒమర్ ను విచారించిన పోలీసులకు అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్టు చెబుతున్నారు. అయితే తన ఉనికిని ఎక్కడా బయటపకుండా ఒమర్ అనేక జాగ్రత్తలను తీసుకొన్నాడు. విదేశాల్లోని ఉగ్రవాదులతో ఒమర్ నేరుగా సంబాషించేవాడు. విధ్వంస ప్రణాళికలను అమలుచేయాలని భావించేలోపుగానే పోలీసులు అతడిని అరెస్టు చేశారు.