బ్రిటిష్ పాలన నుంచి హాంకాంగ్ చైనా చేతుల్లోకి వెళ్లి శనివారానికి అంటే జూలై ఫస్టుకు 20 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుండి హాంకాంగ్ చైనా సార్వభౌమాధికారం క్రింద పూర్తి "స్వయం నిర్ణయాధికారం" ఉన్న "ప్రత్యెక పాలనా ప్రాంతం" గా (స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్) పరిగణించబడుతూ వస్తుంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి-జిన్పింగ్ హాంకాంగ్ లో పర్యటించారు.
ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పేరుతో హాంకాంగ్లో చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసేలా ప్రజలు గీత దాటితే క్షమించమనీ అన్నారు. జిన్పింగ్ పర్యటన సందర్భంగా పలువురు హాంకాంగ్ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హాంకాంగ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను చైనా నిర్దేశిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు చాలా కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
దీనిపై జిన్పింగ్ మాట్లాడుతూ... హాంకాంగ్ ప్రజలు ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ఇంతకు ముందెన్నడూలేరన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం తో ఒప్పందం ప్రకారం ఒక దేశం-రెండు వ్యవస్థలు విధానాని కి హాంకాంగ్ ప్రజలు కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆసియాకు ఆర్థిక కేంద్రంగా ఉన్న హాంకాంగ్ మరింత అభివృద్ధి చెందటంపై దృష్టి పెట్టాలనీ, ఆందోళనలు పురోగతిని దెబ్బ తీస్తాయని జిన్పింగ్ అన్నారు.