మాట్లాడేందుకు తన ప్రియురాలిని ఇంటికి పిలిపించుకున్న ఓ యువకుడు రెండు గంటల తర్వాత ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన విశాఖపట్నం, పూర్ణామార్కెట్ పరిధిలోని పండా వీధిలో చోటు చేసుకుంది. విశాఖ నగరం26వ వార్డు పండావీధికి చెందిన బొందలపు సతీష్కుమార్(23), 23వ వార్డు రంగిరీజువీధిలో నివసిస్తున్న బూరలి భవానీ(18) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ఇరువురి కుటుంబాల్లోని పెద్దల అంగీకరించారు.
శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సతీష్ భవానీకి ఫోన్చేసి నీతో మాట్లాడాలంటూ ఇంటికి పిలవడంతో ఆమె వెళ్లింది. వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నట్టు స్థానికులు తెలిపారు. 2.30 గంటల ప్రాంతంలో సతీష్ ఉంటున్న ఇంటి నుంచి స్థానికులకు రక్తధార కనిపించడంతో పరిశీలించారు. రక్తపు మడుగులో భవానీ నిర్జీవంగా కనిపించడంతో సతీష్ను నిలదీశారు. సమాధానం చెప్పకపోవడంతో చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు.
తీవ్ర గాయాలతో ఉన్న సతీష్ను పోలీసులు కేజీహెచ్కు తరలించారు. భవానీని మూడేళ్లుగా ప్రేమిస్తున్నా. ఆమె నన్ను ప్రేమిస్తున్నానని చెపుతూనే మోసం చేసేందుకు ప్రయత్నించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పినా మరొకరితో సన్నిహితంగా మెలుగుతోంది. ఇది చూసి తట్టుకోలేకపోయే దాడికి పాల్పడ్డానని’ నిందితుడు సతీష్ తెలిపాడు. స్థానికల దాడిలో తలపై, శరీరంపై బలమైన గాయాలు తగలడంతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని కేజీహెచ్ క్యాజువాల్టీ వైద్యాధికారి డాక్టర్ సురేంద్ర తెలిపారు.