జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్లో గల బాటెంగూ వద్ద శ్రీనగర్ హైవేపై ఉన్న పోలీసు పార్టీపై సోమవారం రాత్రి 08.30 సమయం లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భారీగా ఆయుధ సామగ్రిని వెంటతెచ్చుకున్న ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు అమర్నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పదిహేను మందికి గాయలైనట్లు కశ్మీర్ ఐజీపీ తెలిపారు.
శ్రీనగర్-జమ్మూ హైవే మీద వెళ్తున్న పోలీసు పెట్రోల్పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో హైవేపై వెళ్తున్న బస్సులో ఉన్న అమర్నాథ్ యాత్ర ప్రయాణికులకు బుల్లెట్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే ఏడుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోగా పదిహేను మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులందరూ గుజరాత్కు చెందిన వారిగా తెలుస్తోంది. పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. జమ్మూ కశ్మీర్ హైవేపై భారీగా బలగాలను మొహరించారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అమర్నాథ్ ఉగ్రదాడిని ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసు లను నిలిపివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.
జమ్ము కశ్మీర్ పై పాకిస్థాన్ ఉగ్రతండా మరోసారి విరుచుకుపడింది. రాజకీయలకు అతీతంగా మన సార్వభౌమత్వానికి నిరంతరం సవాళ్ళు ఎదురౌతున్నా మనమెందుకు భరించాలి. దెబ్బకు దెబ్బ తీయనినాడు మనకు దేశమెందుకు? సార్వ భౌమత్వానికి గల విలువేమిటి? దీనికి సత్వర ఉపశమనచర్య ఆర్టికిల్ 370 రద్దుచేయటమే. భారతీయులందరూ సమానమె భారత దేశమంతా ఒక్కటే అనే స్పూర్తి మాత్రమే జమ్ము కశ్మీర్ ను మనతో కలిపి ఉంచగలదు అనే విషయం ఎంత త్వరగా భారత ప్రభుత్వం గ్రహిస్తే అంతమంచిది.
అమర్నాథ్ యాత్రికులపై దాడిని ఎవరు చేశారనే విషయాన్ని జమ్మూకశ్మీర్ భద్రతా బలగాలు వెల్లడించారు. లష్కరే తోయిబా కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. ఈ దాడి వ్యూహం పన్నిని కీలక సూత్రదారుడు అబూ ఇస్మాయిల్ అనే పాకిస్థాన్ ఉగ్రవాది అని కశ్మీర్ ప్రధాన పోలీసు అధికారి మునీర్ఖాన్ వార్తా సంస్థకు వెల్లడించారు.
ఇస్మాయిల్తో సహా మరో ముగ్గురు ఈ దాడులకు పాల్పడినట్లు వివరించారు. ఈ సందర్భంగా అతడి ఫొటోను మీడియాకు విడుదల చేశారు.సోమవారం జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులే.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు. సైనికులు సంయుక్తంగా గాలింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో నేడు జమ్మూకశ్మీర్ అంతటా విశ్వహిందూ పరిషత్కు చెందిన కార్యకర్తలు, జమ్ము కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చాయి. మరోపక్క, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ లేఖలో పేర్కొన్నారు.