దేశరాజకీయాల్లో అపార చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సౌత్లోనూ అదరగొడతున్నాడు. ముందుగా నరేంద్ర మోదీని పీఎం పీఠంపై, తర్వాత బీహార్ సీఎం చైర్లో నితీష్ కుమార్ను కూర్చోబెట్టడంలో పర్ఫెక్ట్ డైరెక్షన్ చేసిన ప్రశాంత్ కిషోర్.. దేశవ్యాప్తంగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్నే నియమించుకుంది కాంగ్రెస్. పంజాబ్లో కాంగ్రెస్ విజయం సాధించినా, యూపీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయినా ప్రశాంత్ దూకుడు తగ్గలేదనే చెప్పాలి. ఇక ఉత్తర రాజకీయాల నుంచి ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన ఈ పీకే ఇప్పుడు వైఎస్ జగన్ వెంట ఉంటూ వైసీపీకి వ్యూహాలు రచిస్తున్నాడు.
ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను పీకే తీసుకున్నాడు. ఆ మేరకు వ్యూహాలను అమల్లో పెట్టేస్తూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. మరోవైపు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు కూడా ఈ రాజకీయ చాణక్యుడు వ్యూహాలు అందించబోతున్నట్టు తాజా సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపినట్లు ఓ ఇంగ్లష్ పత్రికలో వచ్చింది. నిజానికి, 2021లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నేత లేకపోవడంతో ఆ లోటును అందిపుచ్చుకోవాలని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కావాలంటే ఇప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తను అందిపుచ్చుకోవాలని స్టాలిన్ అనుకుంటున్నట్టు టాక్.
మొత్తానికి ఇటు జగన్ను, అటు స్టాలిన్ను ముఖ్యమంత్రులుగా చేసే వ్యూహర్తగా ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.