టీడీపీ సీనియర్ లీడర్, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే ఛాన్సులు లేనట్టే తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మురళీమోహన్ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో కలియతిరిగారు. చిన్న చిన్న ఫంక్షన్లకు సైతం హాజరయ్యారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన మాగంటి ఈ మూడేళ్లలో నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు చాలా తక్కువ.
టీటీడీ చైర్మన్ పోస్టుపై కన్నేసి కొద్ది రోజులుగా ఆయన చేస్తోన్న ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తనను సీనియారిటీ షాకుతో పక్కన పెడతారని భావించిన ఆయన కొద్ది రోజులుగా తన కోడలు రూపాదేవిని వెంట పెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చారు. చంద్రబాబు మాత్రం మురళీమోహన్కు లేదా ఆయన ఫ్యామిలీని పూర్తిగా పక్కన పెట్టేయాలని డిసైడ్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మురళీమోహన్ మళ్లీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనదే అని ప్రకటించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీలోని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త అవంతి గ్రూప్స్ అధినేత అవంతి ఇంద్రకుమార్కు ఇవ్వాలని బాబు ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంద్రకుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం అన్నదేవరపేట. ఇంద్రకుమార్ తాత అల్లూరి బాపినీడు పశ్చిమగోదావరి జిల్లా మాజీ జడ్పీచైర్మన్.
సామాజిక సమీకరణల్లోను, ఆర్థికపరంగాను ఇంద్రకుమార్ రాజమండ్రి ఎంపీ సీటుకు సరైన అభ్యర్థి అవుతారని బాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మురళీమోహన్ లేదా ఆయన ఫ్యామిలీకి సీటు ఇవ్వకూడదన్న ఆలోచన బాబు మైండ్లో ఫిక్స్ అయిపోయిందట. ఈ మ్యాటర్ లీక్ కావడంతోనే ఇప్పుడు మురళీమోహన్ తిరిగి తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా 2019 ఎన్నికల వేళ మురళీమోహన్ ఇంటికే పరిమితమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.