వచ్చే ఎన్నికల్లో పోటీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు అప్పుడే ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటోన్న వారు నియోజకవర్గాలు మారడమో లేదా ? కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే అక్కడ నుంచి పోటీ చేసేందుకో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని సీనియర్లు సైతం వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాలు మారేందుకు ఇప్పటి నుంచే స్కెచ్లు వేస్తున్నారు.
సామాజిక సమీకరణల పరంగాను, వ్యతిరేక కారణాలతో వీరు నియోజకవర్గాలు మారేందుకు రెడీ అవుతోన్నట్టు తెలుస్తోంది. స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి ప్రాథినిత్యం వహిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లోనే చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు కేవలం 730 ఓట్లతో గెలిచారు. ఇక ఇప్పుడు ఆయనకు సత్తెనపల్లితో పాటు ఆయన గతంలో ప్రాథినిత్యం వహించిన నరసారావుపేట నియోజకవర్గాల్లోను తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన గుంటూరు వెస్ట్ లేదా కొత్తగా ఏర్పడే నకరికల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లలో ఉన్నారు.
ఇక ఇప్పటికే మూడు ఎన్నికలకు మూడు నియోజకవర్గాలు మారిన మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో నగరంలో ఏదో ఒక నియోజకవర్గం లేదా విజయనగరం జిల్లా భీమిలి నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భీమిలిలో భూ కుంభకోణం తర్వాత ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
బందరు నుంచి ప్రాథినిత్యం వహిస్తోన్న మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ బందరు పోస్టు భూసేకరణతో వ్యతిరేకత ఎదురవ్వడంతో ఆయన బందరు పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఇక జిల్లాకే చెందిన మరో మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరంలో భారీ యాంటీ ఉంది. దీంతో ఆయన కొత్తగా ఏర్పడే ఇబ్రహీంపట్నం లేదా విజయవాడ రూరల్ నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓవరాల్గా టీడీపీలో హేమాహేమీలు నియోజకవర్గం మార్పు కోసం చేస్తోన్న ప్రయత్నాల వార్తలు ఇప్పుడు అధికార పార్టీలో పెద్ద సంచనలమవుతున్నాయి. ఇక ఈ జాబితాలోనే గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లు కూడా ఉన్నారని తెలుస్తోంది.