ఏపీలో అధికార టీడీపీ - మిత్రపక్షమైన బీజేపీ మధ్య కొనసాగిన స్నేహం నిన్నటి వరకు ఓ లెక్క, నిన్నటి నుంచి ఓ లెక్క. నిన్నటి వరకు ఈ రెండు పార్టీల మధ్య, నాయకుల మధ్యా ఏవైనా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగినా వాటిని సరిచేసుకోవడానికి అటు బీజేపీలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వెంకయ్యనాయుడు, ఇటు టీడీపీలో ఏపీ చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక ఏపీ బీజేపీని వెంకయ్య నాయుడు హస్తాల నుంచి విడిపించేందుకు ఏపీ బీజేపీ నాయకులు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలేవి సక్సెస్ కాలేదు. వెంకయ్య రాష్ట్రపతిగా వెళ్లిపోవడంతో ఇప్పుడు ఏపీ బీజేపీలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే ఏపీకి చెందిన వెంకయ్య కేంద్ర కేబినెట్లో కీలక శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన ఉప రాష్ట్రపతిగా వెళ్లిపోవడంతో ఆయన రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రి పదవులకు కూడా రాజీనామా చేయాల్సి ఉంది. వెంకయ్య రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాథినిత్యం వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే కేంద్ర కేబినెట్ బెర్త్ టీడీపీ ఆశిస్తోంది.
కేంద్రంలో టీడీపీ ఎంపీలుగా ఉన్న అశోక్ గజపతిరాజు కేబినెట్ మంత్రిగా ఉండగా, సుజనాచౌదరి సహాయమంత్రిగా ఉన్నారు. ఇక మోడీకి బాబు అన్ని విధాలా అండగా ఉండడంతో త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనలో టీడీపీకి మూడో బెర్త్ దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాయి. ఆ బెర్త్పై బీసీ కోటాలో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజ్యసభ కోటాలో సీఎం.రమేశ్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు.
అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం బీజేపీ కోటాలో ఖాళీ అవుతోన్న ఈ కేబినెట్ బెర్త్ను బీజేపీతోనే భర్తీ చేయాలని మోడీ, అమిత్ నిర్ణయం తీసేసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీని భారీగా ప్రక్షాళన చేసే క్రమంలో చాలా మార్పులు, చేర్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును ఆ బాధ్యతల నుంచి తప్పించి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది.
ఇక ఏపీ బీజేపీ పగ్గాలను నరసాపురంకు చెందిన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకు ఇవ్వడం దాదాపు ఖరారు అయినట్టే అని తెలుస్తోంది. హరిబాబును ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినా ఆయనకు ఇబ్బంది లేకుండా ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి, మరో ఎంపీగా ఉన్న గంగరాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించనున్నారట.