గడిచిన మూడేళ్ల పాలనలో చంద్రబాబు సర్వేల సీఎంగా పేరుబడ్డ సంగతి తెలిసిందే. ఆయన తన పనితీరు సహా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ.. వాటి ఆధారంగా క్లాస్ తీసుకోవడం తెలిసిందే. ఇప్పటి వరకు చేపట్టిన అన్ని సర్వేల్లోనూ సీఎం బెస్ట్.. ఎమ్మెల్యేల పనితీరే మెరుగుపడాలి! అని రిజల్ట్ వచ్చాయి. దీంతో ఆయా ఎమ్మెల్యేలకు సీఎం క్లాసివ్వడం తెలిసిందే. అంతేకాదు, ఈ సర్వేల్లోనే ఎమ్మెల్యేల అవినీతి కూడా బయటపడింది. పనికో రేటు కట్టి దోచేసి.. దాచేస్తున్న నేతల గుట్టూ బయటపడింది. ఈ సందర్భాల్లో చంద్రబాబు వారిని హెచ్చరించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ఇక, ఏమైందో ఏమో ఎన్ని సర్వేలు చేయించాని చంద్రబాబుకు తృప్తిగా లేకపోవడం, మరోపక్క 2019 ఎన్నికలు తరుముకొని వస్తుండడం, దీనికితోడు విపక్షం వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచడంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే.. అనే కాన్సెప్ట్ రాష్ట్రంలో ప్రచారంలో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న సీఎం చంద్రబాబు పరిస్థితిని అధ్యయనం చేసేందుకు దేశంలోని ప్రముఖ సెఫాలజిస్టులను పిలిపించారట. వీరితో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు, సీఎంగా తన పనితీరుపైనా ఆయన తాజాగా ఓ సర్వే చేయించారట. విచిత్రం ఏంటంటే.. ఈ సర్వేలోనూ చంద్రబాబు బెస్ట్ అయితే... ఎమ్మెల్యేలు వేస్ట్ అనే రిజల్ట్ వచ్చిందట!!
ఈ మూడేళ్ల పాలనలో చంద్రబాబు పనితీరుకు 75శాతానికిపైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, అదేసమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం ఒకింత అసహనం, అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సర్వే విషయాలు చూచాయగా బయటకు రావడంతో ఎమ్మెల్యేలంతా తలలు పట్టుకుంటున్నారు. తాము కూడా బాబు మాదిరిగానే కష్టపడుతున్నామని కొందరు నెత్తీ నోరూ బాదుకుంటుండగా.. మరికొందరు మాత్రం ఈ సర్వేలు ఇంతే అనుకుని సరిపెట్టుకుంటున్నారట. దాదాపు 60 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తపరచారట! కొన్ని స్థానాల్లో కొత్తవారిని నిలబెట్టినా ఓటమి ఖాయం అనే రేంజితో ఎమ్మెల్యేల పనితీరు ఉంటోందని సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. ఈ సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమూలాగ్రం పరిశీలించారనీ, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను త్వరలోనే పిలిపించి మాట్లాడతారంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సర్వే పరిశీలించిన తరువాత… ఇకపై పార్టీ మేనేజ్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. అయితే, వాస్తవానికి సీఎం పనితీరు బాగున్నప్పుడు ఆయన టీం ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగుండాలి కదా?! కానీ, విచిత్రంగా టీడీపీ ఎమ్మెల్యేలపై మరకలు పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.