2019 ఎన్నికలకు సంబంధించి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ పొందడం అంత వీజీ కాదా? ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సహా కొత్త వారు కూడా కఠోర పరీక్షలను ఎదుర్కొంటేనేగానీ టికెట్ పొందలేని పరిస్థితి ఉందా? ముఖ్యంగా గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయిస్తారా? అదీగాక, నిత్యం ప్రజల్లో ఉండేవారికే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు తాజా పరిణామాలు ఔననే అనిపిస్తున్నాయి. ఇలా వెళ్లి అలా టికెట్ సంపాయిందించే పరిస్థితి ఇక లేదని కూడా పరిస్థితులు చాటుతున్నాయి. అసలేం జరుగుతోందో చూద్దాం.. 2019లో ఎలాగైనా సరే ఏపీలో సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవాలని నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్.. అందుకు తగిన విధంగా పావులు కదిపారు.
ఈ క్రమంలోనే రాజకీయ వ్యూహకర్తగా దేశం దృష్టిని ఆకర్షించిన ప్రముఖ ఐఐటీయెన్ ప్రశాంత్ కిశోర్ని నియమించుకున్నారు. పీకే చెప్పినట్టు అడుగులు వేస్తున్నారు. ఇంతకు ముందు ఎవరిమాటా వినని వ్యక్తిగా పేరు పడ్డ జగన్ ఇప్పుడు ప్రశాంత్ ఎంత చెబితే అంత అంటూ ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్లీనరీలో రెండేళ్లకు ముందుగానే ఆయన ప్రజలకు నవరత్నాలు పేరుతో హామీల వరద పారించారు. ఇక, ఇప్పుడు ప్రశాంత్ వచ్చే ఎన్నికల్లో టికెట్లపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగుల్లో గెలుపు గుర్రాలు ఎందరు? టికెట్ ఆశిస్తున్న వారిలో గెలిచేది ఎందరు? వంటి అనేక వివరాలను ఆయన ఇప్పటికే రాబట్టారు.
జగన్ గెలుపును సీరియస్గా తీసుకున్న ప్రశాంత్ కిశోర్.. తాను ఎంపిక చేసిన బృందాలను జిల్లాలకు పంపుతున్నారు. వారు ఎంపీ, ఎమ్యెల్యే అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది? ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏమిటి? బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని ఆయా నియోజక వర్గ ఇంచార్జ్ లు చేపట్టారా లేదా? ప్రస్తుతం ఎమ్యెల్యే టికెట్ ఆశిస్తూ, కో ఆర్డినేటర్లు గా పనిచేస్తున్న వారి పనితీరు ఎలా ఉంది? వంటి సకల సమాచారాన్నీ ఈ బృందం సభ్యులు కూలంకషంగా రాబడుతున్నారు. దీనిని బట్టి 2019 గెలుపుపై ఓ అంచనాకు రావాలని నిర్ణయించారు.
అదే సయమంలో టికెట్ ఆశిస్తున్నవారి నుంచి కూడా అభిప్రాయాలు చేపడుతున్నారు. మీకు గెలిచే అవకాశం లేకపోతే.. ఎవరిని సజెస్ట్ చేస్తారు? లేదా ఏ వ్యూహంతో మీరు గెలవాలని నిర్ణయించుకున్నారు? వంటి అనేక విషయాలను అభ్యర్థుల నుంచి రాబడుతున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి అసెంబ్లీ స్థానం ఆశిస్తున్న ప్రస్తుత సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్య ప్రకాశరావు పేరుతో పాటు మరికొందరి పేర్లు అధిష్టానానికి పీకే టీం నివేదించినట్టు సమాచారం. అయితే, ఈ స్థానానికి ప్రస్తుత వైసీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి తో పాటు ప్రముఖ ఆడిటర్ విశ్వనాధం భాస్కర రామ్ పేరు ను కొందరు సూచించినట్లు సమాచారం. ఆయన పేరును పార్లమెంట్ , అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలించాలని అన్ని వర్గాలతో విశేష సంబంధాలు ఆర్థికంగా ఎన్నికలను ఎదుర్కొనే సత్తా, జిల్లా వ్యాప్తంగా వున్న కేబుల్ నెట్ వర్క్ వంటి వాటిని ఉదాహరణగా ఈ టీం పేర్కొంది.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినియోజకవర్గం నుంచి పీకే టీం నివేదికలు రూపొందించి పంపుతుంది. దీనిని బట్టి మాత్రమే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. అయితే, దీనిపై వైసీపీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి అండగా ఉంటూ వచ్చామని, ఇప్పుడు సీటు విషయానికి వచ్చేసరికి ఇలా సర్వేలతో ఇబ్బంది పెడితే ఎలా అని అంటున్నారు. మరి దీనిపై పీకే ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. మొత్తానికి పీకే నిర్ణయం సంచలనంగా మారిందనేది వాస్తవం.