టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్తో ఒక్కసారిగా వైసీపీ నుంచి జంప్ చేసి సైకిలెక్కిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఒక్కటే బెంగ పట్టుకుందట. తామేమన్నా తొందరపడ్డామా ? అని వారు తీవ్రంగా చర్చించుకుంటున్నారట. అప్పట్లో బాబు చేసిన అభివృద్ధిని చూసి తాము జెండా మార్చామని చెప్పుకొన్నా.. ఇప్పుడు మాత్రం తొందర పడ్డామని, జగన్ దగ్గరే బెస్ట్ అని వారు అనుకుంటున్నారట. వీరి అంతర్గత చర్చల్లో వినిపిస్తోన్న సంభాషణలే ఇప్పుడు ఏపీ పొలిటికల్ కారిడార్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
వీరి చర్చలకు రెండు మూడు బలమైన కారణాలు చూపిస్తున్నారు కూడా. వీటిని చూపిస్తూ.. వాళ్లు మళ్లీ జగన్ చెంతకే చేరిపోవాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఇప్పుడు టీడీపీ నుంచి కనీసం ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీలో చేరేందుకు రెడీ ఉన్నారని సమాచారం. విషయంలోకి వెళ్తే.. బాబు పాలన బాగుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పేర్కొంటూ .. వైసీపీని వీడి దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కేశారు. వీరికి తోడు ఇద్దరు ఎంపీలతో పాటు కొందరు ఎమ్మెల్సీలు, మొత్తంగా 29 మంది ప్రజాప్రతినిధులు పసుపు కండువా కప్పుకున్నారు.
వీరు ఎందుకు పార్టీ మారారో అందరికీ తెలిసిందే. కొందరు పదవుల కోసం, మరికొందరు కేసుల నుంచి విముక్తి పొందడం కోసం పార్టీ మారారు. అయితే, ఇటీవల ఆశించిన వారికి పదవులు దక్కలేదు. దీనికితోడు టీడీపీలో పోటీ దారులు పెరిగిపోయారు. పోనీ నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందా? అంటే అది జరిగే వరకు గ్యారెంటీ లేదు. చెప్పుకోవడానికి తప్ప. దీంతో 2019 నాటికి టీడీపీలో ఉంటే కనీసం టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ విషయాన్ని గమనించిన ఆరుగురు ఎమ్మెల్యేలు మళ్లీ గోడకు కొట్టిన బంతి మాదిరిగా జగన్ గూటికి వచ్చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కోస్తాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు యూ టర్న్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
వీరితో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి.. పార్టీలోకి తిరిగి వచ్చేస్తామని తమకు టచ్లో ఉన్న వైసీపీ నేతలతో రాయబారాలు కూడా నడుపుతున్నారట. అయితే, వీరి ప్రతిపాదనపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికి వైసీపీ జంపింగ్ జిలానీలు తీసుకున్న నిర్ణయం టీడీపీ అధినేతకు ముచ్చెమటలు పట్టించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.