సాధారణ ఎన్నికల స్థాయిని ఎప్పుడో మించి పోయిన నంద్యాల ఉప ఎన్నిక.. ఇంకా ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ విడుదల కాకముందే 100 డిగ్రీల వేడి పుట్టిస్తోంది! భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ పోస్టు ద్వారా అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు తమ తమ ప్రాబల్యాలను నిరూపించుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. వాస్తవానికి ఈ సీటు నుంచి 2014లో వైసీపీ తరఫున భూమా గెలిచినప్పటికీ.. అనంతర కాలంలో బాబు ఆపరేషన్ ప్రభావంతో ఆయన టీడీపీ సైకిలెక్కేశారు. దీంతో ఇప్పుడు ఇరు పార్టీలూ ఈ సీటును తమదంటే తమదని రచ్చకెక్కుతున్నాయి. దీంతో త్వరలోనే జరగనున్న ఉప ఎన్నిక సాధారణ ఎన్నికల స్థాయిని దాటిపోతోంది.
ఇక, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. నంద్యాలలో గెలుపు ద్వారా తన మూడేళ్ల పాలనకు ప్రజలు పచ్చజెండా ఊపుతున్నారని చెప్పుకోవాలని సీఎం చంద్రబాబు ఉబలాటపడుతున్నారు. అందుకే ఆయన ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అంతర్గత సమావేశాలలో ఆయన ఈ ఎన్నికను రెఫరెండంగా భావిస్తున్నట్టు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ఆయన నంద్యాలపై ఇప్పుడు ఎక్కడా లేని ప్రేమను ఒలక బోస్తున్నారు. 12 మంది ఎమ్మెల్యేలకు, 8 మంత్రులకు ఈ ఎన్నిక గెలుపు బాధ్యతను అప్పగించారంటేనే బాబు ఎంత సీరియస్గా భావిస్తున్నారో తెలుస్తోంది. అదేసమయంలో అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నారు.
ఎప్పుడో 70 ఏళ్ల కిందటి ప్రతిపాదనకు ఇటీవల యుద్ధప్రాతిపదికన ఫైల్ తయారు చేయించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారంటే.. బాబు వ్యూహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, నంద్యాలలో ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే పరిష్కారం అయ్యేలా యంత్రాంగాన్ని సైతం సిద్ధం చేశారట. ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నంద్యాలలో ప్రచారానికి తరలి వెళ్లాడు. సీఎం చంద్రబాబు శనివారం(ఈరోజు) నంద్యాలలో పర్యటన పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సార్లు పర్యటించి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. మరి అధికార పక్షం ఇలా దూసుకుపోతుంటే విపక్షం మాత్రం ఊరికేనే ఉంటుందా? జగన్ కూడా ఇదే వ్యూహంతో రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు ఆయన తనదైన శైలిలో ముందుకు పోతున్నారని తెలుస్తోంది. టీడీపీ నుంచి వచ్చే తమ్ముళ్లకు పార్టీలో పెద్ద పీట వేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సహా ఆయన అనుచరులను జగన్ పార్టీలోకి చేర్చుకుని ప్రచార బాధ్యతలు కూడా అప్పగించినట్టు తెలుస్తోంది. ఇంకా వచ్చేవారి కోసం గాలిస్తున్నారని కూడా సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఉప ఎన్నికే అయినప్పటికీ.. అధికార పక్షం కీలకంగా తీసుకున్న నేపథ్యంలో తాను కూడా దీనిని సీరియస్గానే తీసుకోవాలని జగన్ భావిస్తున్నాడట.
అందుకే ఆయన నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేయడం ద్వారా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆయనకు బాగా కలిసొచ్చిన రోడ్ షోల ద్వారా నంద్యాలలో ప్రచారం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. అధికార పార్టీకి పెద్ద దెబ్బే అని అంటున్నారు విశ్లేషకులు. టీడీపీలో రోడ్ షో చేసే నేత ఏ ఒక్కరూ లేరు. ఒక వేళ చేసినా.. జగన్కున్న ఇమేజ్ వారికి లేదు. సో.. జగన్ రోడ్ షో ఆయుధం తీస్తే ఖచ్చితంగా టీడీపీ కి ఇబ్బంది ఖాయమనే మాట వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.