ఎత్తి నామీద పెట్టేవాడుంటే.. కొండనైనా అవలీలగా మోసేస్తాను- అన్నాడట వెనకటికి ఒకడు. ఇప్పుడు అచ్చు అలాంటి కామెంట్లతోనే కామెడీ పుట్టించేస్తున్నాడు తెలంగాణలో కేసీఆర్ టీం మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా సూర్యాపేట కు చెందిన జగదీష్ రెడ్డి లా చదివి.. రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్ రెడ్డిపై చిత్తుగా ఓడిపోయాడు.
ఆ తర్వాత 2014లో సూర్యాపేటకు మారిన ఆయన స్వయంగా కేసీఆర్ ప్రచారం చేసి పెట్టడంతో అప్పటి ఎన్నికల్లోనూ తక్కువ మెజారిటీతో గెలుపొందాడు. అయితే, ఇప్పుడు ఈ విషయాన్ని మరిచిపోయిన జగదీష్ రెడ్డి.. తాను ఎక్కడైనా గెలిచే గెలుపు గుర్రాన్నంటూ ప్రగల్భాలు పలకడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రస్తుతం మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి భారీ ఎత్తున ప్రగల్భాలు పలుకుతున్నారు. తనకు ఏపీలోనూ పోటీ చేసి గెలవగల సత్తా ఉందని చెప్పడం దీనికి ఉదాహరణ. వాస్తవానికి 2009లో హుజూర్నగర్లో ఏం జరిగిందో మరిచిపోయిన ఆయన ఇప్పుడు ఇలా ప్రగల్భాలు పలకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలంగాణలోనే దిక్కలేని ఈ నేత ఏపీలో గెలుస్తానని అనడం పొలిటికల్ కామెడీకి తెరదీసింది. ఇక, మంత్రిగా ఈయన పరిస్థితి ఏంటో చూద్దాం. ఇటీవల సీఎం కేసీఆర్.. తన టీంపై పరోక్షంగా సర్వే చేయించిన విషయం తెలిసిందే. అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులపై ఆయన సర్వే చేయించి వారి పనితీరును తెలుసుకున్నారు.
ఈ సర్వేల్లో కూడా జగదీష్కు పాస్ మార్కులు కూడా రాలేదని సమాచారం. అన్ని సర్వేల్లోనూ అతి తక్కువ మార్కులే వచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా.. ఇవ్వరా అనే చర్చ జోరుగా నడుస్తోంది. జగదీష్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే.. డేంజరేనని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే వీలైతే కఠిన నిర్ణయం తీసుకుని ఆయన్ను పక్కకు తప్పించాలని భావిస్తున్నారు.
మరి ఇంత జరుగుతుంది కాబట్టే.. జగదీష్ కు టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియకుండా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అసలు తానేం చెబుతున్నారో తనకే తెలియని స్థితిలో జగదీష్ ఉన్నారని సన్నిహితులే వాపోతున్నారు. ఇదిలావుంటే, సూర్యాపేటలో కాంగ్రెస్ నానాటికీ పుంజుకుంటోందట. దీనిని ముందే పసిగట్టిన కేసీఆర్.. జగదీష్కు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా జగదీష్ సార్ నోరు అదుపులో పెట్టుకుంటాడో లేదో చూడాలి.