రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు ముగుస్తుండడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నియామకం కేంద్ర ప్రభుత్వ మదిలో ఉంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి గవర్నర్గా ఉన్న నరసింహాన్ను తప్పించి ఆయనకు కేంద్రంలో ఇంటిలిజెన్స్ విభాగంలో కీలకపదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు మరో 20 నెలల టైం ఉంది. ఈ లోగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగే సత్తాలేదని డిసైడ్ అయిన బీజేపీ ఇక్కడ అధికార పార్టీలతో పొత్తులతోనే ముందుకు వెళ్లే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక్కడ ఓ కొత్త ట్విస్ట్ కూడా తెరమీదకు వచ్చింది. ఏపీలో ప్రస్తుతం టీడీపీతో కంటిన్యూ అవుతోన్న బీజేపీ పొత్తు వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా ? లేదా ? అన్న సందేహాలు కూడా ఇప్పుడిప్పుడే కలుగుతున్నాయి. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్తో బీజేపీ పొత్తుకు సానుకూల సంకేతాలు పంపుతోంది. ఈ క్రమంలోనే ఇక్కడ తమకు బాగా నమ్మకమైన వ్యక్తిని గవర్నర్గా నియమించుకుని చక్రం తిప్పాలన్నది బీజేపీ ప్లాన్.
వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని ముందుగా కేంద్రం అనుకున్నా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కామన్గా పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉండడంతో ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ ను తెలుగు రాష్ట్రాల గవర్నర్గా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఆయనకు ఎంతో నమ్మకంగా ఉన్న ఆనందీని గుజరాత్ సీఎంగా నియమించారు. అయితే గుజరాత్ అల్లర్లను కంట్రోల్ చేయడంలో దారుణంగా విపలమవ్వడంతో ఆమెను సీఎం పీఠం నుంచి తప్పించారు. ఆనందిబెన్ స్థానంలో విజయ్రూపానీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకు ఏ పదవి దక్కలేదు. ఇక సీఎం పీఠం కోల్పోయాక ఆమెను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపుతారన్న హామీ ఆమెకు వచ్చినట్టు సమాచారం.
ఇక ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పదవీ కాలం ఎప్పుడో ముగిసినా రాష్ట్రపతి ఎన్నికలు ముగిసేవరకు కొనసాగాల్సిందిగా ఆయనకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఇక ఇప్పుడు ఆయన్ను కేంద్ర నిఘా విభాగంలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా పెద్దగా సత్సంబంధాలు లేని చంద్రబాబు, కేసీఆర్ మధ్య ఓ లేడీ గవర్నర్ను నియమిస్తే ఆమె ఏపీ, తెలంగాణ మధ్య సంక్లిష్టంగా ఉన్న చాలా విషయాలతో పాటు ఈ ఇద్దరు చంద్రులను ఎలా డీల్ చేస్తారన్నదే ? పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.