తెలుగు బీజేపీ రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగిన వెంకయ్య నాయుడు ప్రస్థానానికి దాదాపు తెరపడింది. వెంకయ్యను గౌరవంగా, ఇంకా చెప్పాలంటే వ్యూహాత్మకంగాను ఉపరాష్ట్రపతిగా పంపేసిన బీజేపీ ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేసేసింది. ఇక ఇప్పుడు ఏపీలో బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్ కానుంది. ఇక్కడ మిత్రపక్షమైన టీడీపీపై దూకుడు రాజకీయాలు చేయనుంది. దీనిపై ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలకు ఆదేశాలు కూడా వచ్చేసినట్టు తెలుస్తోంది.
బీజేపీ జాతీయనేత రాం మాధవ్ ఏపీ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు అప్పుడే తన కార్యాచరణ స్టార్ట్ చేసేశారు. ఏపీ బీజేపీ పగ్గాలు చూస్తోన్న వెంకయ్య మనిషి, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును తప్పించేసి, ఆయన ప్లేస్లో తన మనిషి, టీడీపీపై దూకుడుగా ముందుకు వెళ్లే ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడం దాదాపు ఖరారైనట్టే.
ఇక ఏపీ బీజేపీ పగ్గాలు పూర్తిగా రాం మాధవ్ కంట్రోల్లోకి వచ్చేయడంతో ఏపీలో బీజేపీని ఒంటరిగా అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను కూడా పార్టీ అధిష్టానం ఆయనమీదే పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఇక బీజేపీ టార్గెట్ 2019 కాకపోయినా 2024లో అయినా ఒంటరిగా ఇక్కడ పాగా వేయడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్లాన్లు వేస్తుందన్నది నిజం.
ఈ క్రమంలోనే రాం మాధవ్ వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి లోక్సభకు పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాం మాధవ్ సొంత నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం. దీంతో రాం మాధవ్ అదే జిల్లాలోని రాజమండ్రి లేదా కాకినాడ లోక్సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీతో బీజేపీ పొత్తు ఉన్నా లేకపోయినా రాం మాధవ్ మాత్రం ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దాదాపు ఫిక్స్ అయినట్టే తెలుస్తోంది.
టీడీపీతో పొత్తు లేకుండానే ఒంటరిగా పోటీ చేయాలన్నది రాం మాధవ్, సోము వీర్రాజు వర్గాల ప్లాన్. తప్పని పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉన్నా రాం మాధవ్ కోసం రాజమండ్రి లేదా కాకినాడ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక సీటును బీజేపీ పట్టుబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా రాం మాధవ్ ఏపీ నుంచి లోక్సభకు పోటీ చేస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలు చాలా చాలా మారడం ఖాయంగా కనిపిస్తోంది.