మన దేశానికి ఆఫ్రికా దేశాల నుండి విదేశీయుల రాక రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. అయితే వీరంతా కేవలం చదువు పేరుతో మన దేశంలోకి ప్రవేశించి యువతచే చేయరాని పనులన్నీ చేపిస్తున్నారు. రాచకొండ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ నైజీరియన్ల నుంచి వివిధ ఆసక్తికర వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్వోటీ, ఎల్బీ నగర్ పోలీసులు నిఘాపెట్టారు. ఈ ముఠాలోని ఐదుగురు నైజీరియన్లతోపాటు వారికి సహకరిస్తున్న విజయవాడకు చెందిన ఓ మహిళను అదుపు లోకి తీసుకున్నారు. వారి నుంచి 2,04,000 నగదుతో కలుపుకొని రూ.9,70,000 విలువ చేసే 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, 39.8 గ్రాముల అంఫిటమైన్ ట్యాబ్లెట్లు, 1.675 కిలోల గంజాయి, 3 ల్యాప్టాప్లు, 6 పాస్పోర్టులు, తొమ్మిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో సీవో అంటే కొకైన్ కావాలని అర్ధం. అలాగే బ్లాక్ బెర్రీ అంటే అమ్మాయి అని అర్థం. సీవో విత్ బ్లాక్ బెర్రీ అంటే డ్రగ్స్ తో పాటు అమ్మాయి కూడా కావాలని అర్థమని విచారణలో గుర్తించారు. విజయవాడకు చెందిన పాలపర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తుండగా, ఫేస్ బుక్ లో సూడాన్ కు చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయంతో సంగీత హైదరాబాద్ కు మకాం మార్చింది. ఆ సూడాన్ స్నేహితురాలి ద్వారా నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్, అతడి స్నేహితులతో పరిచయమైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి వారితో కలసి డ్రగ్స్ అక్రమ రవాణాలో భాగస్వామిగా మారింది.
తమ దేశానికి చెందిన గాబ్రియెల్ అనే స్నేహితుడి సాయంతో కొకైన్, బ్రౌన్ షుగర్, అంఫిటమైన్ వంటి డ్రగ్స్ ను టాబ్లెట్ ల రూపంలో తీసుకొచ్చి స్నేహితులైన జాన్ ఒకొరి, సిరిల్, హెన్రీలతో కలిసి వీరిద్దరూ హైదరాబాదులోని పలువురు డ్రగ్ వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు తీసుకుని వినియోగిస్తున్నారు. డ్రగ్స్ ను సరఫరా చేసే క్రమంలో పలువురితో ఏర్పడిన సంబంధాలతో వీరు వ్యభిచారాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ తో పాటు అమ్మాయిలను కూడా వీరు సరఫరా చేస్తారు. ఇందుకోసం వీరు కోడ్ లాంగ్వేజ్ ను వాడుతారు.