ఏపీ సీఎం చంద్రబాబుకు, టీడీపీకి కేంద్రంలో రోజు రోజుకు ప్రయారిటీ తగ్గుతోందా ? వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని వ్యూహాత్మకంగా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా ? రాష్ట్రపతి ఎన్నికల ముందు వరకు చంద్రబాబుకు ఇచ్చిన ప్రయారిటీతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రయారిటీ తగ్గిపోయిందా ? తాజాగా బీజేపీ జాతీయ నేత రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఊతమిస్తున్నాయి. రాం మాధవ్ తాజాగా మాట్లాడుతూ బీజేపీ అనేది చారిటీ కాదని, దేశంలో అన్ని రాష్ట్రాల్లోను అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. రాం మాధవ్ మాటల్లో తమకు పార్టీ హితమే కాని, ప్రజా హితం అక్కర్లేదన్నది నేరుగా ధ్వనించింది.
ఆయన ప్రత్యక్షంగా తెలంగాణలో టీఆర్ఎస్పై దాడి చేయాలని చెప్పినా, పరోక్షంగా ఏపీలో టీడీపీని అలాగే ట్రీట్ చేయాలని చెప్పారు. చంద్రబాబుతో అవసరం బీజేపీకి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో చాలా వరకు తీరిపోయినట్టే. ఇక ఏపీలో చంద్రబాబును బాగా వెనకేసుకువచ్చే వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతికి పంపేయడంతో బీజేపీ చాలా వరకు బాబును ఒంటరి చేసే విషయంలో సక్సెస్ అయ్యింది. ఏపీకి, అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు ఆశించిన మేర నిధులు ఇవ్వడంతో చంద్రబాబుకు సరైన సహకారం బీజేపీ నుంచి లేదు. ఇక చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా ? అన్నది కూడా డౌటే.
ఇక ఈ సంగతి ఇలా ఉంటే ఈ మూడేళ్లుగా తెలంగాణకు చెందిన టీడీపీ దళితనేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ గిరీ ఇస్తామని బీజేపీ ఆశలు చూపుతూ వస్తోంది. నరసింహులు గవర్నర్ గిరీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు. మోత్కుపల్లి గవర్నర్ పదవి వచ్చేసిందని ఎన్నోసార్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు చంద్రబాబుతో బీజేపీకి అవసరం తీరిపోవడంతో ఆయనకు మోడీ ఇచ్చిన ఈ చిన్న హామీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదన్నది క్లీయర్గా తెలిసిపోతోంది.
తెలంగాణలో టీడీపీతో అవసరం లేదని బీజేపీ ఓపెన్గానే చెప్పేసింది. అవసరమైతే టీఆర్ఎస్తో కలుస్తాం, లేకుంటే ఒంటరిపోరే అని బీజేపీ కుండబద్దలు కొట్టేస్తోంది. ఇక వెంకయ్య కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవడంతో టీడీపీ తరపున అడిగితే చంద్రబాబు అడగాలే తప్ప వాయిస్ వినిపించేవారే లేరు. ఇక తెలంగాణలో ఒంటరిగా ఎదగాలనుకుంటోన్న బీజేపీ, టీడీపీకి చెందిన మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదని టాక్. టీడీపీకి చెందిన మెత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తే మనకు వచ్చే లాభం ? ఏంటన్నది బీజేపీ నేతల లాజిక్.
తెలంగాణలో చాలా యేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడిన బీజేపీ సీనియర్లు చాలా మంది ఉన్నారు. వారికి పదవి ఇచ్చుకుంటే ఉపయోగం ఉంటుంది గాని టీడీపీకి చెందిన మోత్కుపల్లికి పదవి వద్దన్న విషయాన్ని టీ బీజేపీ నేతలు ఇప్పటికే అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఇక చంద్రబాబు ఏపీ మీదే దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ప్రభావం ఏ మాత్రం ఉండదని బీజేపీ డిసైడ్ అయ్యింది. ఇక ఇప్పట్లో చంద్రబాబు అవసరం కూడా ఆ పార్టీకి ఉన్నట్టు లేదు. దీంతో టీడీపీని చాలా చాలా లైట్ తీస్కొనే పరిస్థితి వచ్చింది.
ఇక చంద్రబాబుకు ఇప్పుడు తెలంగాణ కంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం. నియోజకవర్గాల పెంపుదల చంద్రబాబుకు ప్రస్తుతం జీవన్మరణ సమస్య. దీంతో ప్రధాని మోడీని కలిసి నియోజకవర్గాల పెంపుదల అంశాన్నే ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో మోత్కుపల్లి గవర్నర్ గిరీ ఇక లేనట్లేనని టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోన్న టాక్. ఏదేమైనా చంద్రబాబు పేరు చెపితే నిన్నటి వరకు ఎంతో ప్రయారిటీ ఇచ్చిన మోడీ, ఇప్పుడు ఎలా లైట్ తీస్కొంటున్నారో కామన్ పీపుల్కు కూడా అర్థమైపోతోందన్నదే ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో వినిపిస్తోన్న హాట్ టాపిక్.