ఏపీలో విపక్ష నేత జగన్ పరిస్థితి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన పరిస్థితి ఏంటి? ఏ పరిస్థితిలో రాజకీయాల్లోకి వచ్చాడు? ఎలాంటి సిట్యుయేషన్లో పార్టీ పెట్టాడు? వంటి కీలకమైన విషయాలు అందరికన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నేతలకే తెలుసు. వైఎస్ హఠాన్మరణంతో సీఎం కావాలని కలలు కన్న జగన్.. అది ఫలించకపోయే సరికి.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీంతోనే కాలు రువ్విన విషయం తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు జగన్కి కోవర్టుల్లా మారిపోయారట! అవకాశం వచ్చిన ప్రతిసారీ జగన్కి ఏదో రూపంలో సాయం చేసేందుకు సిద్ధం అవుతున్నారట. దీంతో ఇప్పుడు వైసీపీతోపాటు కాంగ్రెస్కి కూడా జగన్ అధ్యక్షుడుగా ఉన్నాడా? ఏంటి? అని అందరూ అనుకుంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. ఏపీలో ఇప్పుడు చంద్రబాబు, జగన్ల మధ్య ఉప్పునిప్పులా ఉంది. విభజనతో అతి పెద్ద జాతీయ పార్టీ ఒక్కసారిగా ప్రభావం కోల్పోయి.. 2014 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటను కూడా కైవసం చేసుకోలేక పోయింది. అయినా కూడా 2019 నాటికి పుంజుకుంటామని కనీసం 40 నుంచి 50 సీట్లను సాధిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా పదే పదే చెబుతున్నారు. ఇది ఎలా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ను ఆదరించే వారు ఒక్కరూ కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ పేరెత్తే కేడర్ కూడా కనిపించడం లేదు. అయితే, దీనిని సవాలుగా తీసుకుని కాంగ్రెస్ను బతికించుకోవాల్సిన నేతలు కూడా ఇప్పుడు ఆ ఊసుమానేసి... జగన్కి ఏ రకంగా సాయం చేద్దాం... అనే ధోరణిపైనే దృష్టి పెట్టడం గమనార్హం.
జగన్ ను టార్గెట్ చేయాలన్న రాహుల్ ఆలోచనలను విస్మరించి... జగన్ తో కలిసి సంసారం చేద్దామన్న భావనలో మా పార్టీ ముఖ్యులు ఉండడం గమనార్హం. త్వరలోనే కర్నూలు జిల్లా నంద్యాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ ఆశించిన శిల్పా మోహన్ రెడ్డి టికెట్ ఆశించాడు. అయితే, అది అంత వీజీ కాకపోవడం వెంటనే పార్టీ ఫిరాయించి జగన్ గూటికి చేరి టికెట్ తెచ్చుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల ఓ కార్యక్రమంలో శిల్పా బ్రదర్స్లో ఒకరైన, ప్రస్తుతం టీడీపీలో ఉన్న చక్రపాణిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు.. "నువ్వు తెలుగుదేశంపార్టీలో ఉండటం దేనికి... బ్రదర్ వైసీపీలోకి వెళ్లారు..నువ్వు కూడా అక్కడికే వెళితే బాగుంటుంది కదా!" అని మేనేజ్ చేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
దీంతో ఆ పరిసరాల్లో ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారట. వీళ్లు కాంగ్రెస్ పార్టీ నేతలా లేక వైసీపీ నేతలా అర్థం కావడం లేదని సన్నిహితుల వద్ద కొందరు నేతలు వాపోయారట. మొత్తం మీద పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల నాటికి పెను ప్రమాదాన్ని ఎదుర్కోకతప్పదన్న భావనలో హస్తం నేతలు ఉన్నారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఈ కోవర్టులపై దృష్టి పెడతారో లేక చూస్తూ కూర్చుంటారో చూడాలి.